Telangana: విద్యార్థినులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్..
తెలంగాణలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థినుల కోసం ప్రభుత్వం భారీ పథకాన్ని సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది.

తెలంగాణలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థినుల కోసం ప్రభుత్వం భారీ పథకాన్ని సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ పథకం అమలుకు అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 70 వేల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీలు, గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులను ప్రధాన లబ్ధిదారులుగా గుర్తించే దిశగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి సుమారు రూ.1,600 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసినట్టు సమాచారం. రానున్న వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశలవారీగా స్కూటీల పంపిణీ చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలపై కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం బేసిక్ మోడళ్ల ధరలు రూ.60 వేల నుంచి ప్రారంభమవుతున్నా.. క్వాలిటీ, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని.. మంచి బ్రాండెడ్ స్కూటీలను ఎంపిక చేసే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటీల ధరలు సాధారణంగా రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్నాయి. ఈ స్కూటీల కొనుగోలుకు టెండర్ ప్రక్రియలో ప్రత్యేక నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. బ్యాటరీపై వారంటీ, కనీసం మూడు సంవత్సరాల సర్వీసింగ్ వంటి అంశాలను కూడా కంపెనీల బాధ్యతగా పెట్టేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
విద్యార్థినులపై రోజువారీ పెట్రోల్ ఖర్చు భారం పడకుండా ఉండటమే కాకుండా, పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ వాహనాలను ఎంపిక చేశారు. అలాగే విద్యార్థినులు దూర ప్రాంతాల నుంచి కాలేజీలకు సులభంగా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల లేమి వల్ల చాలా మంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పథకం అమలైతే ఆ డ్రాప్ అవుట్ సమస్య తగ్గడమే కాకుండా ఉన్నత విద్యలో మహిళల నమోదు కూడా బాగా పెరిగే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
