హైదరాబాద్ HCUలో భారీ దొంగతనం బట్టబయలు.. 60 ల్యాప్టాప్లు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్..
గచ్చిబౌలి పోలీసులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని సీఆర్ రావు ప్రాంగణం నుండి దొంగిలించబడిన 60 ల్యాప్టాప్ల కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులను, వీరిలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఉన్నారు, అరెస్టు చేసి, దొంగిలించిన ల్యాప్టాప్లతో పాటు నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలు సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాయి.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని సీఆర్ రావు ఎఐఎమ్ఎస్ ప్రాంగణంలో జరిగిన 60 ల్యాప్టాప్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మొత్తం దొంగిలించిన 60 ల్యాప్టాప్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కేసు పూర్తి డిటెల్స్ లోకి వెళితే…
ల్యాప్ టాప్ ల చోరీ ఘటనపై ఈ నెల 9న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో నిందితులు కూకట్పల్లి ప్రాంతానికి చెందిన రెగుల చంద్ర శేఖర్ (30), అలాగే బీటెక్ చదువుతున్న విద్యార్థులు చెరుకూరి సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19) లు గా పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
నిందితులు రాత్రి సమయంలో అక్రమంగా ప్రాంగణంలోకి ప్రవేశించి 60 ల్యాప్టాప్లను అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం గౌలిదొడ్డి ప్రాంతంలోని నెక్స్ జెన్ హాస్టల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుల వద్ద నుండి మొత్తం దొంగిలించిన ఆస్తిలో భాగంగా 60 ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, అలాగే నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి. నరేష్ దర్యాప్తు చేయగా, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె. బాలరాజు మార్గదర్శకత్వంలో, ఏసీపీ జి. వెంకట రమణ గౌడ్, అదనపు డీసీపీ ఎన్. ఉదయ్ రెడ్డి, డీసీపీ శ్రీనివాస్, పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




