Road Terror: మృత్యు మార్గంగా మారిన NH 44.. ఒకే రోజు ఒకే జిల్లాకు చెందిన నలుగురు మృతి!
జాతీయ రహదారి 44 ఆదిలాబాద్ జిల్లా ప్రజల పాలిట మృత్యుమార్గంగా మారింది. ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకుంది. నిర్మల్, నేరడిగొండ, అడ్లూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. సెలవులు ముగించుకుని ఇంటికి వస్తున్న తండ్రి కూతురు, విధులకు హాజరయ్యేందుకు వైజాగ్ వెళ్తున్న ఓ నేవీ ఆఫీసర్ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది NH 44. జాతీయ రహదారి 44 పై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

జాతీయ రహదారి 44 రక్తమోడింది. నిర్మల్ జిల్లా నీలాయి పేట వద్ద ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బండి శంకర్ ( 45 ) కూతురు కృతిక ( 22 ) అక్కడి కక్కడే మృతి చెందారు. హైదరబాద్లో బీటెక్ చదువుతున్న కృతికకు శనివారం పరీక్షలు పూర్తి కావడంతో వేసవి సెలవుల కోసం ఇంటికి తీసు కురావడానికి తండ్రి శంకర్ హైదరాబాద్కు వెళ్లారు. శనివారం రాత్రి కృతికను తీసుకుని ఇంటికి బయలుదేరారు. నిర్మల్ జిల్లా నీలాయిపేట వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు, రోడ్డు పక్కను ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే శంకర్ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కృతిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్ విలాస్కు తీవ్ర గాయాలు కావడంలతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ఆదిలాబాద్ జిల్లాలో రెండో ప్రమాదం …
ఈ ఘటన మరువక ముందే గంట వ్యవదిలో జాతీయ రహదారి 44 పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ ఫ్లాజ్ వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లా వివేక్ నగర్ కు చెందిన వెంకటేశ్ (35) మృతి చెందాడు. వెంకటేశ్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అన్వేష్ ఇద్దరు బావ, బావమరిదులు. పని కోసం ఆదిలాబాద్ కు వెళ్లిన వెంకటేశ్ ఆదివారం బావ మరిదితో కలిసి నిర్మల్ కు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ బావమరిది అన్వేష్కు గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
కామారెడ్డి జిల్లాలో మూడో ప్రమాదం..
ఇదే రహదారిపై కామారెడ్డి జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది. మూడవ ప్రమాదంలోను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులే ప్రమాదానికి గురవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠం గ్రామానికి చెందిన అమూల్ నేవీలో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవలే ఇంటికి వచ్చిన అమూల్, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సెలవులు రద్దు కావడంతో.. భార్య ప్రణీతను తీసుకొని ఆదివారం వైజాగ్కు బయల్దేరారు. మార్గమధ్యలో అదుపు తప్పిన వీళ్లు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో అమూల్ భార్య ప్రణీత తీవ్రంగా గాయపడంది, అమూల్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఇక తీవ్ర గాయాలపై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రణీత మృతిచెందింది. మూడు వరుస ప్రమాదాల్లో ఆదిలాబాద్ వాసులే అసువులు పాయడంతో జిల్లాలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
