పార్లమెంటు ఎన్నికల ప్రచారం పూర్తిగా రైతుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు పంట చేతికి రావడంతో పాటు కొన్ని ప్రాంతాలలో పంటలు ఎండిపోయాయి. ఈఅంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే ముఖ్యనేతలు ఎండిన పంటపొలాలను పరిశీలించారు. ఈనెల 5న మాజీ సియం కెసిఅర్ ఎండిన పంటపోలాలను సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో పరిశీలించనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యకర్శి, కరీంనగర్ ఎంపి బండిసంజయ్ మంగళవారం కరీంనగర్ కలెక్టరెట్ ఎదుట రైతు దీక్ష చేపెట్టానున్నారు. ప్రతిపక్షాల తీరుపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
కరీంనగర్ లోకసభ ఎన్నికల వేడి మొదలైంది.. నామినేషన్లకు గడువు రాకున్నా నేతలు తమ ప్రచార అస్త్రాలన్నీ బయటికి తీస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అధికంగా రైతులే ఉన్నారు. ఇప్పుడు పలు ప్రాంతాలలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరో పదిహేను రోజులలో పంటలు చేతికి రానున్నాయి. అయితే కండ్ల ముందే ఈ సమస్య ఉండడంతో దీనిపైనే దృష్టి పెట్టాయి ప్రతిపక్షాలు. ఇప్పటికే కరీంనగర్లో బిజెపి నుండి ఎంపిగా పోటిచేస్తున్న బండిసంజయ్, బిఅర్ఎస్ నుండి పోటి చేస్తున్న వినోద్ కుమార్ ఎండిన పంటపోలాలని పరిశీలించారు. ఈ రెండు పార్టీలు కూడా సాగునీటి సమస్యపై అందోళనలు నిర్వహించాయి. ఇప్పుడు రైతు సమస్యలపై మరింత ఫోకస్ పెట్టారు బిఅర్ఎస్ అధినేత, మాజీ సియం కెసిఅర్
ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్తున్నారు. ఈనెల 5న కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటపోలాలను పరిశీలించనున్నారు. అంతకంటే ముందు ఈనెల 2న రైతు సమస్యలపైన కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బిజేపి నేత బండిసంజయ్ రైతుదీక్ష చేపెట్టానున్నారు. ఇప్పటికే మండలాల వారిగా బిజేపి నేతలు రైతు సమస్యలపైన అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అంతేకాకుండా రైతుల కల్లాల వద్దనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిజెపి పిలుపు నిచ్చింది. ఈ రెండు పార్టీలు రైతుల సమస్యల అధారంగానే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. 10 రోజులలో వరి ధాన్యం ఐకెపి సెంటర్లకి రావడం, అమ్మడం లాంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. అయితే అదనంగా క్వింటాల్కి రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరెండు పార్టీలు గళం విప్పుతున్నాయి.
ప్రతిపక్ష పార్టీలకి ధీటుగానే అధికార పార్టీ సమాధానం చెబుతుంది. గత సంవత్సరం సరియైన వర్షాలు లేకపోవడం, వేగంగా ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గిపోవడం కారణంగా కరువు ఏర్పడిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వేళా ప్రతిపక్ష పార్టీలు రైతు సమస్యలపైనా మాట్లాడుతున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం కారణంగానే రైతు సమస్యలు మరింత పెరిగాయని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ మూడు పార్టీలు రైతుల వైపే చూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..