Hyderabad: 48 కేజీల బంగారం.. 3.83 లక్షల వజ్రాలతో గణేషుడి విగ్రహం.. అసలు నిజం ఇదే!
హైదరాబాద్లోని ఓ గణేష్ విగ్రహం 48 కేజీల బంగారం, లక్షల వజ్రాలతో రూ.4 కోట్లతో తయారైనట్లు సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం జరిగింది. అయితే, ఈ వాదనలు అవాస్తవమని గోషామహల్ పోలీసులు స్పష్టం చేశారు. స్టోర్ యాజమాన్యం కూడా అలాంటి ప్రకటనలు చేయలేదని, భద్రతా ఆందోళనలతో పోలీసులను ఆశ్రయించింది. ధృవీకరించని సమాచారాన్ని ఫార్వార్డ్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

హైదరాబాద్: బేగం బజార్లోని ఫీల్ఖానాలో లీచీ పెర్ల్స్ అండ్ జ్యువెల్స్ ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహంపై సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం వివాదానికి దారితీసింది. ‘లీ-చీ కా రాజా గణేష్–2026’ విగ్రహాన్ని పంచలోహంతో తయారు చేశారని, 48 కిలోల బరువు ఉంటుందని, 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు 3,83,800 అమెరికన్ వజ్రాలు పొదిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు, కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. విగ్రహం విలువ రూ.4 కోట్లుగా కూడా ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై గోషామహల్ పోలీసులు స్పందించారు. విగ్రహానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమైన వివరాలు అవాస్తవమైనవి హైదరాబాద్ పోలీసులు తెలిపారు. తాము అలాంటి ప్రకటనలు చేయలేదని లీచీ పెర్ల్స్ అండ్ జ్యువెల్స్ యాజమాన్యం స్పష్టం చేసినట్లు గోషామహల్ ఇన్స్పెక్టర్ బి. శ్రవణ్ కుమార్ వెల్లడించారు. వైరల్ ప్రచారం కారణంగా ప్రజల్లో ఆందోళనతో పాటు స్టోర్ యాజమాన్యంలో భద్రతా ఆందోళనలు తలెత్తినట్లు తెలిపారు.
స్టోర్ యజమాని అదర్ అగర్వాల్ స్పందిస్తూ.. తమ సంస్థ మొదటగా ఈ వివరాలను ప్రచారం చేయలేదని, వైరల్ పోస్టుల నేపథ్యంలో కుటుంబ భద్రతపై ఆందోళనకు గురయ్యామని చెప్పారు. రికార్డులను స్పష్టం చేసేందుకు పోలీసులను ఆశ్రయించి, రక్షణ కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ధృవీకరించని సమాచారం, పోస్టులు, వీడియోలను నమ్మకుండా ఫార్వర్డ్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
