AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.

దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు!
Danam Nagender
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2026 | 5:09 PM

Share

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపు కేసులో ఆయనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ  దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2024 మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు స్పీకర్‌ను ఆశ్రయించారు.

దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను పరిశీలించిన శాసనసభ స్పీకర్‌ గతంలో వాటిని తిరస్కరించారు. దీంతో స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తొలుత సెప్టెంబర్‌ 16న తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ, న్యాయస్థానం తీర్పును సెప్టెంబర్‌ 18కి వాయిదా వేసింది.

ఈ కేసులో ప్రధానంగా దానం నాగేందర్‌ పార్టీ మారిన అంశం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం చర్చకు వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు విషయంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ నిబంధనలు ఎలా వర్తిస్తాయన్న అంశంపైనా న్యాయస్థానం విచారణలో పరిశీలన జరిగింది.

తాజా హైకోర్టు తీర్పుతో దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడింది. 2024లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీచేశారు దానం. అప్పటినుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2024 ఏప్రిల్‌ 23 నుంచి అనర్హుడిగా ప్రకటించింది.  దీంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతినిధ్యంపై తదుపరి రాజ్యాంగపరమైన ప్రక్రియ ఏ విధంగా సాగుతుందన్నది కీలకంగా మారింది.

దానం నాగేందర్‌ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధి అనంతరం మరో పార్టీలో చేరితే అనర్హత నిబంధనలు ఎలా అమలవుతాయన్న అంశంపై ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్‌ తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ తీర్పుపై అప్పీల్‌ చేస్తారా? తదుపరి న్యాయపరమైన ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us