AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘భారత్ సముద్ర మథనం’ షురూ.. సముద్ర గర్భంలో దాగిన చమురు కోసం భారీ ఆపరేషన్!

భారత్ ఇంధన భద్రత లక్ష్యంగా, ఆయిల్ ఇండియా ₹15,000 కోట్లతో లోతైన సముద్రంలో చమురు, గ్యాస్ అన్వేషణ చేపడుతోంది. కృష్ణ-గోదావరి, అండమాన్ బేసిన్లలో 8 డీప్‌వాటర్ బావుల తవ్వకానికి ప్రణాళికలున్నాయి. కేంద్రం ‘సముద్ర మంథన్’ పథకం ద్వారా ₹84,084 కోట్లతో మద్దతునిస్తోంది. 2030-31 నాటికి దేశీయ ఉత్పత్తి పెంచి, దిగుమతులపై ఆధారపడటం తగ్గించడమే ఈ భారీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.

‘భారత్ సముద్ర మథనం’ షురూ.. సముద్ర గర్భంలో దాగిన చమురు కోసం భారీ ఆపరేషన్!
Samudra Manthan
Balaraju Goud
|

Updated on: Sep 18, 2026 | 6:17 PM

Share

భారత్‌ ఇంధన భద్రతను బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) వచ్చే మూడేళ్లలో దేశంలోని లోతైన, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు కోసం భారీ స్థాయిలో అన్వేషణ చేపట్టనుంది. ఇందుకోసం దాదాపు రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ ప్రణాళికలో సుమారు ఎనిమిది లోతైన సముద్ర అన్వేషణ బావులు తవ్వే అవకాశం ఉందని OIL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రాథ్ తెలిపారు. అయితే తుది బావుల సంఖ్య సీస్మిక్ డేటా విశ్లేషణ ఆధారంగా నిర్ణయించనున్నారు.

నాలుగు కీలక సముద్ర బేసిన్లపై ఫోకస్

ఆయిల్ ఇండియా ప్రస్తుతం అండమాన్, కృష్ణా-గోదావరి (KG), మహానది, కేరళ-కొంకణ్ సముద్ర అవక్షేప బేసిన్లలో అన్వేషణపై దృష్టి పెట్టింది. కృష్ణా-గోదావ, మహానది బేసిన్లలో సంస్థ ఇప్పటికే రెండు చొప్పున బ్లాకులను సొంతం చేసుకుంది. దాదాపు 48,000 చదరపు కిలోమీటర్ల లోతైన, అత్యంత లోతైన సముద్ర ప్రాంతంలో 2D, 3D సీస్మిక్ సర్వేలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ డేటాను విశ్లేషించడంతో పాటు పాత సీస్మిక్ డేటాను కూడా రీ-ప్రాసెస్ చేస్తున్నారు. అండమాన్ బేసిన్‌లో ఇప్పటికే సహజ వాయువు ఉనికికి ప్రోత్సాహకరమైన సంకేతాలు లభించాయి. శ్రీ విజయపురం-2లో గ్యాస్ ఉనికిని గుర్తించగా, శ్రీ విజయపురం-3లో గ్యాస్ డిస్కవరీ నమోదైందని ఆయిల్ ఇండియా వెల్లడించింది. దీంతో ఈ ప్రాంతంలో మరింత లోతైన అన్వేషణకు ప్రాధాన్యం పెరిగింది.

‘సముద్ర మంథన్’తో కేంద్రం అండ

లోతైన సముద్రంలో చమురు, గ్యాస్ అన్వేషణ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘సముద్ర మంథన్–నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు రూ. 84,084 కోట్ల కేటాయింపుతో ఆమోదం తెలిపింది. ఈ పథకం 2030-31 వరకు అమల్లో ఉంటుంది. లోతైన సముద్ర అన్వేషణ బావుల తవ్వకానికి ప్రభుత్వం అర్హత కలిగిన వ్యయంలో 50 శాతం వరకు లేదా ఒక్కో బావికి రూ. 675 కోట్లు – ఏది తక్కువైతే అది అందించనుంది. పథకంలో 60 డీప్‌వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ బావుల తవ్వకానికి రూ. 43,200 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 2030-31 నాటికి దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం, కొత్త హైడ్రోకార్బన్ నిల్వలను గుర్తించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్వేషణ విజయవంతమైతే దేశ హైడ్రోకార్బన్ వనరుల నిల్వలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది.

విదేశీ ఆస్తులపైనా దృష్టి

దేశీయ అన్వేషణతో పాటు ఆయిల్ ఇండియా విదేశాల్లోనూ చమురు, గ్యాస్ ఆస్తులపై దృష్టి కొనసాగిస్తోంది. సంస్థకు రష్యా, వెనిజులా, నైజీరియా, గాబన్, లిబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్లో కార్యకలాపాలు ఉన్నాయి. ఆయిల్ ఇండియా విదేశీ E&P ఆస్తుల కొనుగోళ్లను కూడా తన వ్యూహంలో భాగంగా కొనసాగిస్తోంది.

దేశ ఇంధన భద్రతకు కీలకమా?

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారుల్లో మూడో స్థానంలో ఉంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతి ఆధారితతను కొంత మేర తగ్గించి ఇంధన భద్రతను బలోపేతం చేయాలన్నది కేంద్రం, ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రధాన లక్ష్యం. అయితే సముద్రంలో అన్వేషణ నుంచి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు సీస్మిక్ సర్వేలు, డ్రిల్లింగ్, నిల్వల నిర్ధారణ, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలన వంటి అనేక దశలు ఉంటాయి. అందువల్ల రూ. 15,000 కోట్ల పెట్టుబడి తక్షణమే దేశీయ చమురు ఉత్పత్తిని పెంచుతుందని కాకుండా, భవిష్యత్ చమురు, గ్యాస్ నిల్వలను గుర్తించే భారీ అన్వేషణ కార్యక్రమంగా చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us