Singareni Tension: పెద్దపల్లి జిల్లా (Peddapalli distric) రామగిరి ఓపెన్కాస్ట్ బొగ్గుగని వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు భూనిర్వాసితులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో భూనిర్వాసితులు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహించారు. సింగరేణి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొగ్గుగనిలోకి బలవంతంగా దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. అయినా పోలీసులు గనిలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో గేటు ఎదుటే బైఠాయించి ధర్నాకు దిగారు. OCP-II ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా, సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి లద్నాపూర్ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది.
అధికారులు ప్రకటించిన మేరకు పునరావాస ప్యాకేజీ అందకపోవడంతో 283 మంది భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. పరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఆర్డీవో నరసింహమూర్తి.. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా, బాధితుల ఇళ్లకూల్చివేతను ఖండించారు జిల్లాపరిషత్ చైర్మన్ పుట్టమధుకర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి