CM Revanth Reddy: రావలసిన ప్రతి పైసా తెచ్చుకునేందుకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాః సీఎం రేవంత్ రెడ్డి
గడిచిన పదేళ్లు నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వం అంటే.. కుటుంబ పాలన కాదన్న రేవంత్ రెడ్డి, తెలంగాణలో పాలన బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.
గడిచిన పదేళ్లు నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వం అంటే.. కుటుంబ పాలన కాదన్న రేవంత్ రెడ్డి, తెలంగాణలో పాలన బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేదదీరడానికి తాను ఫాంహౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. లోతైన ఆలోచన చేసి సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో రాజకీయం లేదని, ఇందులో రాజకీయ ప్రయోజన కోణంలో సెప్టెంబర్ 17ను చూడటం అవివేకమవుతుందని తెలిపారు.
ఇక తన ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తన స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో తాను ఢిల్లీ వెళ్లడం లేదని తెలిపారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని రేవంత్ ప్రకటించారు. ఢిల్లీ భారతదేశంలోనే ఉందని, మరో దేశంంలో లేదన్నారు. కేంద్రం నుంచి రావలసిన ప్రతి పైసా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన ప్రజాపాలనదిన వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అక్షరవీరులు ఒకవైపు, సాయుధ యోధులు మరో వైపు సాగించిన పోరాటంలో 76 ఏళ్ల క్రితం హైదరాబాద్ రాజ్యం స్వేచ్ఛ పొందిందని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాంతానికో.. ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదన్న సీఎం.. సెప్టెంబర్ 17 ను కొంతమంది వివాదాస్పదం చేస్తున్నారన్నారు.
లేక్సిటీగా ఉన్న హైదరాబాద్ ఫ్లడ్ సిటీగా దిగజారడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని సీఎం రేవంత్ ఆరోపించారు. కేరళలాంటి దుస్థితి హైదరాబాద్కు రాకుండా చూసేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని ప్రకటించారు. హైడ్రా ఒక పవిత్ర కార్యమని, ఇందులో ఎటువంటి స్వార్థమూ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ భవిష్యత్కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుందని, ఇది తన భరోసా అని సీఎం రేవంత్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..