Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది.

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరగనుంది. పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేశారు
మరోవైపు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే.వినోద్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.
బీఆర్ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఈ నెల 4న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అయితే ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం అందులో స్పష్టం చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం నాటి సుప్రీం కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ కోరుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని పదే పదే చెప్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..