తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చాస్తోంది. చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అడుగంటుతుండటంతో పంటలపై ప్రభావం పడుతోంది. అయితే రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవలే విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పొలంబాట కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి, కరెంటు లో వోల్టేజ్ సరఫరాకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటే ముందు ఎనిమిదేండ్లు తాము ఇవ్వగలిగినప్పుడు కరెంటు ఇప్పుడెట్ల మాయమైందని కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భగీరథతో నీళ్లు అందించామని.. ఇప్పుడు మళ్లీ ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు. ట్యాంకర్లు రావాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కేసీఆర్. కరెంట్ వస్తూ పోతోంది కాబట్టే మోటార్లు కాలిపోతున్నాయన్నాయంటూ పేర్కొన్నారు.
అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ కేసీఆర్ చేస్తు్న్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ మంత్రులు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే అని.. ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
పదేండ్లుగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..