ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిచలేమని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ చేసిన తీరుతామని బీజేపీ శ్రేణులు భీష్మించి కూర్చున్నారు. సికింద్రాబాద్ మహాత్మ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్లో పోలీసులు ప్రత్యేక బలగాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆపార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, సీనియర్ నేతలు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, విజయశాంతి, బంగారు శృతి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నడ్డా పర్యటన సందర్భంగా శంషాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించగా.. అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జేపీ నడ్డాను కలిసి ర్యాలీకి వెళ్లొద్దని కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీకి అనుమతి లేదని జేపీ నడ్డాకు విమానశ్రయంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, జితేందర్రెడ్డి, డీకే అరుణ, రాంచంద్రరరావు, ప్రేమేందర్రెడ్డిలో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బండి సంజయ్ అరెస్టు, అనంతర పరిణామాలను పార్టీ నేతలు నడ్డా దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం.