Telangana: హైదరాబాద్లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ.. ఈవీ రంగంలో బిగ్ బూస్ట్..
ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా కన్ను ఇప్పుడు హైదరాబాద్పై పడిందా? ఎలోన్ మాస్క్ కంపెనీ తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో టెస్లా ఇండియా ప్రతినిధులు సమావేశమై కీలక విషయాలపై చర్చించారు. దీనికి సంబంధించిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందా..

భాగ్యనగరం మరో అంతర్జాతీయ దిగ్గజానికి వేదిక కాబోతోందా? ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవం సృష్టించిన టెస్లా చూపు ఇప్పుడు హైదరాబాద్పై పడిందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. నగరంలో సేల్స్, సర్వీస్ కేంద్రాల ఏర్పాటు దిశగా టెస్లా అడుగులు వేస్తుండటం ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా శుక్రవారం నాడు టెస్లా ఇండియా ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. హైదరాబాద్లో టెస్లా కార్యకలాపాల విస్తరణ, ఇందుకు ఉన్న అనుకూల అవకాశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ ఈవీ ఎకోసిస్టం అద్భుతం: మంత్రి
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ఇప్పటికే విద్యుత్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ రంగాలకు అవసరమైన టెక్నాలజీ ఎకోసిస్టంను బలోపేతం చేసిందని వివరించారు. ముఖ్యంగా సెమీకండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ వంటి రంగాల్లో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోందని మంత్రి ప్రతినిధి బృందానికి గుర్తుచేశారు. టెస్లా కేవలం ఈవీ కార్ల తయారీ సంస్థ మాత్రమే కాదని..ఏఐ, రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీస్, అధునాతన తయారీ రంగాల్లో కూడా సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సంస్థగా గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు.
హైదరాబాద్ ఎందుకు బెస్ట్ ఛాయిస్
ప్రస్తుతం దేశ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్లో ఈ రంగంలో భారీ విస్తరణ అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న టెక్ సామర్థ్యాలు, సెమీకండక్టర్ రంగ అభివృద్ధి, స్మార్ట్ మొబిలిటీపై పెరుగుతున్న దృష్టి.. టెస్లా దీర్ఘకాలిక లక్ష్యాలకు సరిగ్గా సరిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ పూర్తి సహకారం
టెస్లా ప్రధాన సంస్థతో పాటు దాని అనుబంధ పరిశ్రమలు, సాంకేతిక రంగ పెట్టుబడులు కూడా తెలంగాణ వైపు వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అవసరమైన పూర్తి సహకారం, రాయితీలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ చర్చలు గనుక కార్యరూపం దాల్చితే.. గ్లోబల్ ఈవీ మ్యాప్లో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
