
మనిషి రక్తం మరిగిన పెద్దపులి తెలంగాణ బోర్డర్ దాటింది. గిరిజనుల గుండెల్లో గుబులు రేపిన మ్యాన్ ఈటర్ వెళ్లిపోయింది. అవును, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది. కుమ్రుంభీమ్ ప్రజలకు పెద్ద పులి భయం తప్పింది. 36 గ్రామాలకు కంటి మీద కనుకు లేకుండా చేసిన మ్యాన్ ఈటర్ అభయారణ్యంలోకి వెళ్లిపోయింది. రైతును చంపి, జనంలో భయాందోళనలు రేపిన పెద్దపులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ప్రాణహిత దాటుకుని అహేరి అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు ఐడెంటిఫై చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి బోర్డర్లో పెద్ద పులి పాద ముద్రలను గుర్తించారు అటవీ అధికారులు.
ఖానాపూర్లో రైతుపై దాడి చేశాక 120 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది టైగర్. మహారాష్ట్రలోకి ప్రవేశించినట్టుగా.. కుమ్రుంభీమ్ జిల్లా గూడెం ప్రాంతంలో పులి పాద ముద్రలు కనిపించాయ్. దాంతో, పెద్దపులి కచ్చితంగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లుగా నిర్ధారించుకున్నారు అధికారులు. వారం పది రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను హడలెత్తించింది పులి. కాగజ్నగర్, చింతలమానపల్లి, బెజ్జూర్ మండలాల్లో తిరుగుతూ 36 గ్రామాల ప్రజలను భయపెట్టింది. ఖానాపూర్లో రైతుపై దాడిచేసి చంపేయడంతో ప్రాణభయంతో వణికిపోయారు జనం. ఎప్పుడు, ఎటువైపు తమపై దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్గూడ ఫారెస్ట్ ఏరియాల్లో పెద్ద పులి కంటపడటంతో పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు అటవీ అధికారులు. 35 ట్రాప్ కెమెరాలు, 50మంది టైగర్ ట్రాకర్స్తో సెర్చ్ ఆపరేషన్ చేశారు. చివరికి, పెద్దపులి మహారాష్ట్ర అభయారణ్యంలోకి వెళ్లిపోయినట్టు గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు, అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..