
హైదరాబాద్, ఫిబ్రవరి 26: విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాలని ఎన్నో కలలుగన్నాడు ఆ యువకుడు. కొడుకు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే చూసి ఆనందించాలని తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురు చూశారు. కానీ వారి కలలు నెరవేరకుండానే అంతలోనే ఆ యువకుడిని మృత్యువు కబలించింది. బ్రెయిన్స్ట్రోక్ రూపంలో చిన్న వయసులోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి..
సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన విశ్రాంత ఆర్టీవో తులసీరాజన్ పెద్దకుమారుడు బండా రుత్విక్రాజన్ (30) ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవల ఎంఎస్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పట్టా చేతికివచ్చిన తర్వాత ఉద్యోగాన్వేషణలో రుత్విక్ బిజీగా ఉన్నాడు. తాజాగా అతను స్నేహితులతో కలిసి హోటల్లో భోజనానికి వెళ్లాడు. అక్కడ భోజనం చేస్తుండగా హఠాత్తుగా కిందపడి పోయాడు. వెంటనే స్నేహితులు అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతను బ్రెయిన్స్ట్రోక్తో మరణించినట్లు నిర్ధారించారు.
రిత్విక్ మరణ వార్తను అతని స్నేహితులు తెలంగాణలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుని మరణంతో కుటుంబంలో పెను విషాదం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రిత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విగతజీవుడైన రుత్విక్ను చూసి అతని తల్లిదండ్రులు, కుటుంబీకులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని స్వస్థలం అయిన తిరుమలగిరికి తరలించారు. రుత్విక్రాజన్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా గతకొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లతో పలువురు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జనసామాన్యం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయందోళనలకు గురవుతున్నారు.
‘
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.