భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం.. రంగంలోకి దిగుతున్న ‘హై-ఆల్టిట్యూడ్ ఎయిర్షిప్’!
రక్షణ రంగంలో సరికొత్త సాంకేతిక సామర్థ్యాలను పెంచుకునే దిశగా భారత్ మరో కీలక అడుగు వేస్తోంది. దీర్ఘకాలిక నిఘా, గూఢచార సేకరణ, సరిహద్దుల పర్యవేక్షణ కోసం స్వదేశీ స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్షిప్లను అభివృద్ధి చేసే భారీ ప్రాజెక్ట్ను భారత ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం. ఈ హైటెక్ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.15 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

దేశ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. శత్రు దేశాల కదలికలను నిరంతరం గమనించేందుకు భారత్ మరో అడుగు ముందుకు వేసింది. సుమారు రూ. 15,000 కోట్ల భారీ బడ్జెట్తో ‘హై-ఆల్టిట్యూడ్ ఎయిర్షిప్’ (AS-HAPS) ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూమికి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో, నెలల తరబడి ఆకాశంలోనే ఉండి నిఘా పెట్టే ‘హై-ఆల్టిట్యూడ్ ఎయిర్షిప్’ (High-Altitude Airship) తయారీకి భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత వాయుసేన పర్యవేక్షణలో, రక్షణ మంత్రిత్వ శాఖ ‘మేక్-I’ (Make-I) పథకం కింద ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇందులో పరిశోధన, అభివృద్ధి ఖర్చులో 70% ప్రభుత్వమే భరిస్తుంది. డ్రోన్లు, శాటిలైట్లకు మధ్య ఉన్న లోటును భర్తీ చేస్తూ, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఈ ఎయిర్షిప్ను రూపొందిస్తున్నారు.
AS-HAPS ప్రాజెక్టు ప్రత్యేకతలు:
- అత్యున్నత ఎత్తు: సాధారణ డ్రోన్లు గరిష్టంగా 12 కి.మీ ఎత్తు వరకు మాత్రమే వెళ్లగలవు. కానీ ఈ ఎయిర్షిప్ 20 కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, శత్రువుల కదలికలను నిశితంగా పరిశీలిస్తుంది.
- నెలల తరబడి నిఘా: ఒకసారి గగనతలంపైకి చేరిన తర్వాత, ఇది నెలల తరబడి కిందకు రాకుండా నిరంతరం నిఘా ఉంచగలదు.
- ఆధునిక సెన్సార్లు: ఇందులో అత్యాధునిక రాడార్లు, హై-రిజల్యూషన్ కెమెరాలు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఉంటాయి.
- వారధిగా పనిచేస్తుంది: లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు (500-2000 కి.మీ) మరియు సాధారణ డ్రోన్ల (12 కి.మీ) మధ్య ఉన్న గ్యాప్ను ఈ ప్రాజెక్టు భర్తీ చేస్తుంది. ఇది భూమి నుంచి శాటిలైట్కు సమాచారాన్ని చేరవేసే కీలక వారధిగా పనిచేస్తుంది.
చైనాకు గట్టి కౌంటర్!
చైనా ఇప్పటికే హై-ఆల్టిట్యూడ్ బెలూన్లు, ఎయిర్షిప్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తోంది. సరిహద్దుల్లో చైనా చేస్తున్న దురాక్రమణలకు, కవ్వింపు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మక పరంగా ఎంతో కీలకం. చైనా మరియు పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏ చిన్న కదలిక జరిగినా, ఈ ఎయిర్షిప్ వెంటనే భారత రక్షణ దళాలను అలర్ట్ చేస్తుంది.
ప్రైవేట్ రంగ భాగస్వామ్యం
ఈ ప్రాజెక్టు కోసం కనీసం ఇద్దరు ప్రైవేట్ భాగస్వాములను ఎంపిక చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వారి సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా సంస్థలను ఎంపిక చేస్తారు. మే 2025లో మధ్యప్రదేశ్లో డిఆర్డిఓ (DRDO) సహాయంతో సుమారు 17 కి.మీ ఎత్తులో ఎయిర్షిప్ను విజయవంతంగా పరీక్షించిన భారత్, ఇప్పుడు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతోంది.
శాటిలైట్ కంటే చౌకగా, డ్రోన్ కంటే ఎక్కువ సమయం నిఘా ఉంచగలిగే ఈ ఎయిర్షిప్ ప్రాజెక్టు, భారత రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
