యాపిల్ కొత్త CEOగా జాన్ టెర్నస్.. మరి టిమ్ కుక్కు ఏ బాధ్యతలు అప్పగించారంటే?
యాపిల్ నాయకత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 15 ఏళ్లు సీఈవోగా ఉన్న టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా మారనున్నారు. సెప్టెంబర్ 1 నుండి జాన్ టర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మార్పులు యాపిల్ వ్యూహంలో హార్డ్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై మరింత దృష్టి సారించనున్నట్లు సూచిస్తున్నాయి.

టెక్ రంగంలో సంచలనాత్మక మార్పుగా యాపిల్ తన నాయకత్వ నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 సంవత్సరాలుగా సీఈవోగా కొనసాగుతున్న టిమ్ కుక్ తన పదవికి వీడ్కోలు పలుకుతుండగా, హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఇక కుక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్ కుక్ నేతృత్వంలో యాపిల్ విశేష ప్రగతి సాధించింది. ఈ కాలంలో కంపెనీ షేరు విలువ సుమారు 20 రెట్లు పెరిగి ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు కొత్త నాయకత్వంతో కంపెనీ దిశలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన జాన్ టర్నెస్ గతంలో మ్యాక్, ఐపాడ్, ఎయిర్పాడ్స్ వంటి ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మ్యాక్ లైనప్ను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. ఇదే సమయంలో, జానీ స్రౌజీను చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్గా నియమించగా, టర్నెస్ స్థానంలో హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగ బాధ్యతలను టామ్ మెరీబ్కు అప్పగించారు.
ఈ మార్పుల ద్వారా యాపిల్ తన వ్యూహాన్ని స్పష్టంగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆపరేషన్స్, సప్లైచైన్ బలం మీద ముందుకు సాగిన కంపెనీ, ఇకపై హార్డ్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై మరింత దృష్టి సారించనుంది. ముఖ్యంగా ఎన్వీడియాతో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలే ఎన్విడియా మార్కెట్ విలువలో యాపిల్ను అధిగమించడం టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన టర్నెస్ నాయకత్వంలో యాపిల్ కొత్త దిశగా ప్రయాణం ప్రారంభించబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
