Agni 5 Missile: అగ్ని 5 క్షిపణి ప్రయోగించనున్న భారత్.. చైనా గుండెల్లో గుబులు.. ఎందుకంటే..
భారతదేశం అగ్ని -5 క్షిపణిని సెప్టెంబర్ 23 న పరీక్షించబోతోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల ఈ క్షిపణికి ఇది 8 వ పరీక్ష.
Agni 5 Missile: భారతదేశం అగ్ని -5 క్షిపణిని సెప్టెంబర్ 23 న పరీక్షించబోతోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల ఈ క్షిపణికి ఇది 8 వ పరీక్ష. ఈ క్షిపణి 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై సునాయాసంగా విరుచుకుపడగలదు. చైనాలోని అనేక నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. అందుకే చైనా అగ్ని 5 క్షిపణి పరీక్షలపై గుబులుతో ఉంది. దీంతో, విస్తరణవాద విధానాలకు అపఖ్యాతి పాలైన చైనా, మీడియాలో క్షిపణి పరీక్షల నివేదికల మధ్య శాంతి.. భద్రత గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఈ సంవత్సరం జూన్లో అగ్ని ప్రైమ్ని కూడా భారత్ పరీక్షించింది. అంతే కాకుండా, అగ్ని -6 పై కూడా పనిచేస్తోంది. ఇది చైనాకు కలవరాపాటు కలిగిస్తోంది. ఈ క్షిపణి సైన్యంలో చేరిన తర్వాత, అణు సాయుధ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి (ICBM) కలిగి ఉన్న ప్రపంచంలోని అత్యున్నత దేశాలలో భారత్ చేరనుంది.
అగ్ని -5 ప్రత్యేకత ఏమిటి? పాకిస్తాన్.. చైనా వద్ద కూడా అలాంటి క్షిపణులు ఉన్నాయా? క్షిపణి పరీక్ష గురించి చైనా ఏమి చెప్పింది? చైనా ఏ UNSC తీర్మానం గురించి మాట్లాడుతోంది? ఈ విషయాలను తెలుసుకుందాం.
అగ్ని -5 శక్తి ఇదీ..
- అగ్ని -5 భారతదేశం యొక్క మొట్టమొదటి, ఏకైక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీనిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. భారతదేశంలో ఉన్న సుదూర క్షిపణులలో ఇది ఒకటి.
- ఈ క్షిపణి పరిధి 5 వేల కిలోమీటర్లు. అగ్ని -5 బాలిస్టిక్ క్షిపణి ఒకేసారి బహుళ వార్హెడ్లను మోయగలదు.
- ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ (MIRV) అమర్చారు. అంటే, ఇది ఒకేసారి బహుళ లక్ష్యాల కోసం ఉపయోగపడుతుంది.
- ఈ క్షిపణి ఒకటిన్నర టన్నుల అణు వార్హెడ్లను మోయగలదు. దీని వేగం మాక్ 24 అంటే, ధ్వని వేగం కంటే 24 రెట్లు ఎక్కువ.
- అగ్ని -5 ప్రయోగ వ్యవస్థలో బాక్స్ సాంకేతికత ఉపయోగించారు. ఈ కారణంగా, ఈ క్షిపణిని ఎక్కడికైనా సులభంగా రవాణా చేయవచ్చు.
- అగ్ని -5 క్షిపణిని ఉపయోగించడం కూడా చాలా సులభం. దీని కారణంగా దీనిని దేశంలో ఎక్కడైనా మోహరించవచ్చు.
ఈ క్షిపణి చరిత్ర ఇదీ..
ఇది అగ్ని సిరీస్ లో 5 వ క్షిపణి. దాని మొదటి పరీక్ష ఒరిస్సాలో 19 ఏప్రిల్ 2012 న జరిగింది. ఇది విజయవంతమైంది. క్షిపణి మొదటి బాక్స్ పరీక్ష జనవరి 2015 లో జరిగింది. ఆ తర్వాత క్షిపణిని రోడ్డు మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు. క్షిపణి చివరి పరీక్ష 10 డిసెంబర్ 2018 న జరిగింది. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఇప్పటివరకు 7 క్షిపణి పరీక్షలు జరిగాయి. అన్నీ విజయవంతమయ్యాయి. 2020 లోనే అగ్ని -5 సైన్యంలోకి ప్రవేశపెట్టారు, కానీ కరోనా కారణంగా, పరీక్ష ఆలస్యం అయింది.
పాకిస్తాన్-చైనా వద్ద అలాంటి క్షిపణులు ఉన్నాయా?
పాకిస్తాన్ గౌరీ -2 క్షిపణి 2300 కిమీ, షహీన్ -2 క్షిపణి 2500 కిమీల రేంజ్ కలిగి ఉంది. 2700 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండే షహీన్ -3 పై పాకిస్థాన్ కూడా పనిచేస్తోంది. చైనాలో భారతదేశం కంటే ఎక్కువ శ్రేణి, ఆధునిక సాంకేతిక క్షిపణులు ఉన్నాయి. చైనా DF-31 క్షిపణి 8000 కి.మీ, DF-41 క్షిపణి 12000 కి.మీ. పరిధితో ఉన్నాయి.
క్షిపణి పరీక్ష గురించి చైనా ఏమి చెప్పింది?
అగ్ని -5 పరీక్ష గురించి, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్ మాట్లాడుతూ.. దక్షిణ ఆసియాలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరికీ ఉమ్మడి ఆసక్తి ఉందని అన్నారు. ఈ దిశగా అన్ని పార్టీలు నిర్మాణాత్మక ప్రయత్నాలు చేస్తాయని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణులను భారత్ అభివృద్ధి చేస్తోందని లిజాన్ అన్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC) రిజల్యూషన్ 1172 లో ఈ విషయంలో ఇప్పటికే స్పష్టమైన నియమాలు ఉన్నాయి.
చైనా ఏ UNSC తీర్మానం గురించి మాట్లాడుతోంది?
UNSC రిజల్యూషన్ 1172 గురించి చైనా మాట్లాడుతోంది. భద్రతా మండలి తీర్మానం 1172 జూన్ 1998 లో నిర్వహించిన అణు పరీక్ష తర్వాత అమలు చేయడం జరిగింది. భారతదేశం, పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని విరమించుకోవాలని.. రెండు దేశాలు తదుపరి అణు పరీక్షల నుండి దూరంగా ఉండాలని ఈ తీర్మానం కోరింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిని నిలిపివేయాలని కూడా ఇది రెండు దేశాలను కోరింది. అయితే, ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి భారతదేశం కట్టుబడి లేదు.
ప్రస్తుతం ఏ దేశాలలో ICBM ఉంది?
ప్రస్తుతం, ప్రపంచంలోని కొన్ని దేశాలలో మాత్రమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ICBM లు) ఉన్నాయి. వీటిలో రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, బ్రిటన్, ఉత్తర కొరియా ఉన్నాయి. ప్రపంచంలో ఈ శక్తిని కలిగి ఉన్న 8 వ దేశం భారతదేశం.
Also Read: Hybrid Flying Car: ఇక కారులో ఎగిరిపోవచ్చు.. త్వరలోనే భారత్లో హైబ్రిడ్ కారు..