ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్న ‘వీవో’
భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగాలని (బ్రేక్ తీసుకోవాలని) చైనా కంపెనీ 'వీవో' నిర్ణయించింది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం..
భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగాలని (బ్రేక్ తీసుకోవాలని) చైనా కంపెనీ ‘వీవో’ నిర్ణయించింది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం ప్రయత్నించవలసి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ అందిన పక్షంలో.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్ క్రికెట్ సంరంభాన్ని నిర్వహించనుంది. ఇక వీవోకి వరుసగా మూడేళ్ళ పాటు ఐపీఎల్ తో కాంట్రాక్టు మిగిలి ఉంది. 2022 అంతమయ్యేలోగా వీవో ఏటా బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా ఈ చైనీస్ కంపెనీని కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా దీన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా సేనలు మన భూభాగంలోకి చొరబడుతుంటే.. చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలన్న పిలుపు ఊపందుకుంటుంటే ఈ చైనా కంపెనీకి ‘కవాటాలు తెరవడంలోని ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు.