AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: ఆసియా కప్‌ ఆడేందుకు భారత్‌కు రానున్న పాకిస్థాన్‌ టీమ్‌!

పాకిస్థాన్‌తో ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నడుమ, భారత ప్రభుత్వం పాకిస్థాన్ పురుషుల హాకీ జట్టును ఆసియా కప్, జూనియర్ ప్రపంచ కప్ టోర్నీలలో పాల్గొనడానికి అనుమతించింది. ఒలింపిక్ చార్టర్‌ను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Asia Cup 2025: ఆసియా కప్‌ ఆడేందుకు భారత్‌కు రానున్న పాకిస్థాన్‌ టీమ్‌!
Ind Vs Pak
SN Pasha
|

Updated on: Jul 03, 2025 | 7:10 PM

Share

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయో తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సీజ్‌ ఫైర్‌ ఉన్నా.. దౌత్య సంబంధాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌ హాకీ జట్టు భారత్‌కు రానుంది. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్, ఈ ఏడాది చివర్లో జరిగే జూనియర్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్‌ పురుషుల హాకీ జట్టు భారత్‌లోకి రావడానికి అనుమతిస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. పాకిస్థాన్‌ను టోర్నీలో పాల్గొనడాన్ని నిరోధించే ఏదైనా ప్రయత్నం ఒలింపిక్ చార్టర్‌ను ఉల్లంఘించడమే అవుతుందని ఆ శాఖ పేర్కొంది.

భారత్‌, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు నిలిపివేసినప్పటికీ, భారతదేశంలో జరిగే మల్టీ నేషనల్‌ టోర్నీ్ల్లో పాకిస్తాన్ పాల్గొనడానికి ప్రభుత్వం ఎటువంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేసింది. ఆసియా కప్ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 7 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరగనుంది, జూనియర్ ప్రపంచ కప్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురైలలో జరగనుంది. “భారత్‌లో జరిగే మల్టీ నేషనల్‌ టోర్నీల్లో ఆడే ఏ జట్టును మేం వ్యతిరేకించడం లేదు. పాకిస్థాన్‌ను ఆపడానికి ప్రయత్నిస్తే, అది ఒలింపిక్ చార్టర్‌ను ఉల్లంఘించినట్లుగా అవుతుంది. కానీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షికత భిన్నంగా ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి సడలింపు ఉండదు” అని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఒలింపిక్ పోటీలను నియంత్రించే ఒలింపిక్ చార్టర్, క్రీడలను శాంతి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక మాధ్యమంగా భావిస్తుంది. ప్రపంచ లేదా ఖండాంతర పోటీలో ఒక దేశం పాల్గొనడాన్ని తిరస్కరించడం అంతర్జాతీయ సమాఖ్యల నుండి తీవ్రమైన పరిశీలనకు దారితీస్తుంది. భారత్‌ భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను ప్రభావితం చేయవచ్చు. అయితే ఈ సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్‌కు కూడా ఇదే రూల్‌ వర్తిస్తుందా? లేదా అనేది చూడాలి. ఆసియా కప్‌ విషయంలో బీసీసీఐ ఇంకా మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. బీసీసీఐ సంప్రదిస్తే నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి