AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Athletics Championship : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు నిరాశ.. 4వ స్థానంలో సచిన్ యాదవ్!

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ 2025లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్‌లో నిరాశపరిచాడు. జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్‌లో అతను మెడల్ రేసు నుంచి నిష్క్రమించాడు. మరోవైపు, యువ అథ్లెట్ సచిన్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు, కానీ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

World Athletics Championship : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు నిరాశ.. 4వ స్థానంలో సచిన్ యాదవ్!
Neeraj Chopra
Rakesh
|

Updated on: Sep 18, 2025 | 6:33 PM

Share

World Athletics Championship : వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌లో అందరినీ నిరాశపరిచాడు. ఈటె విసిరే పోటీ(జావెలిన్ త్రో)లో పతకం సాధిస్తాడని అందరూ ఆశించినప్పటికీ, అతను టాప్-8 స్థానం నుండి బయటపడ్డాడు. ఫైనల్‌లో అతని అత్యుత్తమ త్రో కేవలం 84.03 మీటర్లు. ఇది అతని వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన కంటే చాలా తక్కువ. నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్ రౌండ్‌లో 84.85 మీటర్ల త్రోతో సులభంగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. కానీ ఫైనల్‌లో అతని మొదటి ప్రయత్నం 83.65 మీటర్లు కాగా, ఇతర ప్రయత్నాలు 84.03, 82.86 మీటర్లుగా నమోదయ్యాయి. ఈ నిరాశాజనకమైన ప్రదర్శనతో అతను చివరికి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

నీరజ్ చోప్రా నిరాశపరిచినప్పటికీ.. మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అతను నీరజ్ చోప్రా కంటే మెరుగైన స్థానంలో, అంటే నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మొదటిసారి పాల్గొన్న సచిన్, తన మొదటి ప్రయత్నంలోనే 86.27 మీటర్ల దూరం విసిరి తన వ్యక్తిగత రికార్డును నెలకొల్పాడు. అతని ఇతర ప్రయత్నాలు 85.71, 85.96, 80.95 మీటర్లు. 2024లో నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించిన సచిన్, భవిష్యత్తులో ఒక గొప్ప అథ్లెట్‌గా ఎదుగుతాడని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పతకాల పట్టిక విషయానికొస్తే ట్రినిడాడ్, టొబాగోకు చెందిన కెషోర్ వాల్కాట్ 88.16 మీటర్ల త్రోతో బంగారు పతకం సాధించాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ 87.38 మీటర్ల త్రోతో రజత పతకం, అమెరికాకు చెందిన కర్టిస్ థామ్సన్ 86.67 మీటర్ల త్రోతో కాంస్య పతకం సాధించాడు. సచిన్ యాదవ్ కాంస్య పతకం సాధించిన థామ్సన్ కంటే కేవలం కొన్ని మీటర్ల తేడాతో పతకాన్ని కోల్పోవడం భారత అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది.

ఈ ఫైనల్‌లో నీరజ్ చోప్రాకు పోటీదారు అయిన పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ కూడా నిరాశపరిచాడు. పారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత అయిన నదీమ్, 82.75 మీటర్ల త్రోతో 10వ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో నీరజ్ చోప్రా, నదీమ్ కంటే మెరుగైన స్థానంలో నిలిచినప్పటికీ, అంచనాలను అందుకోలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..