IPL 2026 Final : మెగా ఫైనల్కు ముందే గుజరాత్ టైటాన్స్కు షాక్.. ఆర్సీబీ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లేనా ?
IPL 2026 Final : మహా సంగ్రామానికి కేవలం 24 గంటల ముందు గుజరాత్ జట్టు ప్రయాణంలో వాతావరణం పెద్ద రచ్చ సృష్టించింది. చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ చేరుకోవాల్సిన శుభ్మన్ గిల్ సేన.. ఉత్తర భారతదేశంలో ముంచెత్తిన తుఫాను, భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

IPL 2026 Final : ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైన వేళ, గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఒక ఊహించని తిప్పలు ఎదురయ్యాయి. మే 31 ఆదివారం నాడు నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో టైటిల్ పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ మహా సంగ్రామానికి కేవలం 24 గంటల ముందు గుజరాత్ జట్టు ప్రయాణంలో వాతావరణం పెద్ద రచ్చ సృష్టించింది. చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ చేరుకోవాల్సిన శుభ్మన్ గిల్ సేన.. ఉత్తర భారతదేశంలో ముంచెత్తిన తుఫాను, భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
న్యూ చండీగఢ్ వేదికగా మే 29న జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను మట్టికరిపించి గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ఘనంగా అడుగుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం శనివారం (మే 30) మధ్యాహ్నమే గుజరాత్ టీమ్ చండీగఢ్ నుంచి అహ్మదాబాద్కు ఫ్లైట్ ఎక్కాల్సింది. కానీ పంజాబ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న ఇసుక తుఫాను, ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో గిల్ అండ్ కో ప్రయాణం గంటల కొద్దీ ఆలస్యమైంది.
విమానం ఆలస్యం కావడంతో శనివారం అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత గానీ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు అహ్మదాబాద్లోని తమ హోటల్ గదులకు చేరుకోలేకపోయారు. సాధారణంగా ఇలాంటి పెద్ద మ్యాచ్లకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి చాలా అవసరం. శనివారం నాడు గుజరాత్ టీమ్ ఎలాంటి ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకోనప్పటికీ, ప్రయాణంలో జరిగిన ఆలస్యం వల్ల ఆటగాళ్లు తీవ్ర అలసటకు గురయ్యారు. సరిగ్గా రెస్ట్ తీసుకునే టైమ్ కూడా వారికి దక్కకుండా పోయింది.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మాత్రం వాతావరణం పరంగా ఫుల్ అడ్వాంటేజ్ దక్కినట్లయింది. ఆర్సీబీ జట్టు మే 27వ తేదీనే అహ్మదాబాద్ చేరుకుంది. దీనివల్ల బెంగళూరు ఆటగాళ్లకు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి, నరేంద్ర మోదీ స్టేడియంలో నెట్స్ లో తీవ్రంగా శ్రమించడానికి బోలెడంత సమయం దొరికింది. ప్రాక్టీస్తో పాటు వారు తగినంత విశ్రాంతి కూడా తీసుకుని ఫుల్ జోష్లో ఉన్నారు. గుజరాత్తో పోలిస్తే ఆర్సీబీ మైండ్ పరంగా, ఫిజికల్ పరంగా కాస్త రిలాక్స్డ్గా బరిలోకి దిగుతోంది.
మరి ఈ అలసట ప్రభావం ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ ప్లేయర్ల ప్రదర్శనపై పడుతుందా లేదా అనేది ఆదివారం సాయంత్రం తేలనుంది. అయితే గుజరాత్ టైటాన్స్కు ఒక పెద్ద ఊరట ఇచ్చే అంశం ఏంటంటే.. ఫైనల్ జరుగుతోంది వారి హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోనే. గత రెండు సీజన్ల నుంచి ఇక్కడి పిచ్, వాతావరణంపై ఆ జట్టుకు పూర్తి అవగాహన ఉంది. పైగా ఇదే ఐపీఎల్ 2026 సీజన్లో ఇక్కడి మోదీ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో గుజరాత్ జట్టు బెంగళూరును ఓడించింది. ఈ హోమ్ అడ్వాంటేజ్, పాత అనుభవం గిల్ సేనకు కొండంత అండగా నిలవనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
