PV Sindhu : పోరాడినా దక్కని ఫలితం.. వరుస సెట్లలో ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్!
PV Sindhu : ప్రపంచ నంబర్ వన్, సౌత్ కొరియా క్రీడాకారిణి ఆన్ సే యంగ్ చేతిలో సింధు వరుస గేమ్స్ లో పరాజయం పాలయ్యారు. గత వారం జరిగిన సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో కూడా సింధు ఈ కొరియన్ స్టార్ చేతిలోనే ఓడిపోవడం గమనార్హం.

PV Sindhu : భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు ఇండోనేషియా ఓపెన్ టోర్నమెంట్లో భారీ షాక్ తగిలింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16) మ్యాచ్లోనే ఆమె ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. ప్రపంచ నంబర్ వన్, సౌత్ కొరియా క్రీడాకారిణి ఆన్ సే యంగ్ చేతిలో సింధు వరుస గేమ్స్ లో పరాజయం పాలయ్యారు. గత వారం జరిగిన సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో కూడా సింధు ఈ కొరియన్ స్టార్ చేతిలోనే ఓడిపోవడం గమనార్హం.
మొదటి గేమ్లో గట్టి పోటీ ఇచ్చినా తప్పని ఓటమి
థాయిలాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్పై తొలి రౌండ్లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న సింధు.. ఈ మ్యాచ్లో ఎలాగైనా ఆన్ సే యంగ్పై గెలవాలని గట్టి పట్టుదలతో కోర్టులోకి దిగింది. మొదటి గేమ్ ప్రారంభంలో ఇద్దరి మధ్య పోరు చాలా ఆసక్తికరంగా సాగింది. ఒక దశలో ఇద్దరూ 10-10 పాయింట్లతో సమానంగా నిలిచారు. సింధు తన అటాకింగ్ గేమ్తో టాప్ సీడ్ ప్లేయర్ను కాస్త ఇబ్బంది పెట్టి 15-14తో ముందంజలో నిలిచింది. కానీ ఆన్ సే యంగ్ వెంటనే పుంజుకుని వరుస పాయింట్లతో 19-16 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఏకంగా 41 షాట్ల సుదీర్ఘ ర్యాలీతో సహా వరుసగా రెండు పాయింట్లు సాధించి మొదటి గేమ్ను 21-17తో కొరియన్ స్టార్ కైవసం చేసుకుంది.
రెండో గేమ్లో పూర్తిగా చేతులెత్తేసిన సింధు
మొదటి గేమ్ కోల్పోయిన ఒత్తిడి సింధుపై రెండో గేమ్లో స్పష్టంగా కనిపించింది. ఆన్ సే యంగ్ కోర్టు అంతటా అద్భుతమైన మూవ్మెంట్స్, స్థిరత్వంతో ఆడుతూ త్వరగా 13-6తో భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. సింధు మ్యాచ్లోకి తిరిగి రావడానికి శతవిధాలా ప్రయత్నించి, కొన్ని పాయింట్ల తేడాని తగ్గించగలిగినప్పటికీ.. కొరియన్ క్రీడాకారిణి మ్యాచ్పై తన పట్టును ఏమాత్రం కోల్పోలేదు. చివరికి ఏకపక్షంగా సాగిన ఈ రెండో గేమ్ను కూడా ఆన్ సే యంగ్ 21-14తో సొంతం చేసుకుంది. దీంతో కేవలం వరుస సెట్లలోనే మ్యాచ్ను ముగించి ఆమె క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
కొనసాగుతున్న ఓటముల పరంపర
ఈ తాజా ఓటమితో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ ఆన్ సే యంగ్పై సింధు వరుసగా 10వ సారి ఓటమిని చవిచూసినట్లయింది. వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో సింధు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా కొరియన్ స్టార్ను ఓడించలేకపోవడం గమనార్హం. కాగా, ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల వల్ల దుబాయ్ మీదుగా ప్రయాణించడం ఎంత భయానకంగా అనిపించిందో సింధు గుర్తుచేసుకున్న వీడియోలు వైరల్ అవుతున్న తరుణంలో, కోర్టులో కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
