Football Controversy : గతంలోనూ ఇదే తప్పు.. ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్బాల్ జట్టుకు భారీ షాక్?
Football Controversy : ఇంగ్లండ్పై విజయం తర్వాత ఫాక్లాండ్ దీవులకు సంబంధించిన వివాదాస్పద బ్యానర్ను ప్రదర్శించిన అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు మరోసారి ఫిఫా దృష్టిలో పడింది. గతంలో భారీ జరిమానా ఎదుర్కొన్న అర్జెంటీనాపై ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Football Controversy : మైదానంలో ఆట ఆడేటప్పుడు ఆటగాళ్లు కేవలం క్రీడా స్ఫూర్తిని మాత్రమే ప్రదర్శించాలి. కానీ ఇంగ్లండ్పై సాధించిన ఒక పెద్ద విజయం తర్వాత అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాళ్లు అతిగా ప్రవహించి కొత్త వివాదానికి తెరలేపారు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వారు మైదానంలో వేడుకలు చేసుకుంటూ ఇంగ్లండ్ దేశాన్ని కించపరిచేలా ఒక వివాదాస్పద బ్యానర్ను ప్రదర్శించారు. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయ వివాదంపై ప్రపంచ ఫుట్బాల్ నియంత్రణ సంస్థ అయిన ఫిఫా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అర్జెంటీనా ఆటగాళ్లు ప్రదర్శించిన ఆ బ్యానర్పై స్పానిష్ భాషలో లాస్ మాల్వినాస్ సన్ అర్జెంటీనాస్ అని రాసి ఉంది. దీని అర్థం “మాల్వినాస్ (ఫాక్లాండ్ దీవులు) అర్జెంటీనా దేశానికి చెందినవి” అని అర్థం. బ్రిటన్, అర్జెంటీనా దేశాల మధ్య ఈ ఫాక్లాండ్ దీవుల విషయంలో కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన భూభాగ వివాదం నడుస్తోంది. అర్జెంటీనా తూర్పు తీరానికి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవులను బ్రిటన్ తన పరిపాలనలో ఉంచుకుంది. కానీ అర్జెంటీనా మాత్రం ఇవి తమవేనని వాదిస్తూ వస్తోంది.
ఈ ఫాక్లాండ్ దీవుల యాజమాన్యం కోసం 1982లో బ్రిటన్, అర్జెంటీనా దేశాల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ భీకర యుద్ధంలో అర్జెంటీనాకు చెందిన 655 మంది సైనికులు, బ్రిటన్కు చెందిన 255 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఆ యుద్ధంలో అర్జెంటీనా ఓటమిని అంగీకరించక తప్పలేదు. నాటి నుంచి నేటి వరకు ఆ దీవులపై బ్రిటన్ తన పూర్తి పరిపాలనా నియంత్రణను కొనసాగిస్తోంది. అయినప్పటికీ అర్జెంటీనా మాత్రం నేటికీ ఆ భూభాగం తమదేనని అధికారికంగా ప్రకటిస్తూనే ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని ఆటగాళ్లు మైదానంలోకి తీసుకురావడంతో వివాదం ముదిరింది.
🇦🇷 | Argentina players after the game with banner stating: “Las Malvinas Son Argentinas” 👀😅#FIFAWorldCup pic.twitter.com/yCMGvuXmlK
— ULTRA ATTACKIVE (@UltraAttackive) July 15, 2026
సాధారణంగా ఫిఫా నిబంధనల ప్రకారం.. క్రీడా మైదానాల్లో ఎలాంటి రాజకీయ, ప్రాంతీయ లేదా వివక్షాపూరితమైన నినాదాలు చేయకూడదు. అలాంటి వాక్యాలు ఉన్న దుస్తులు, బ్యానర్లు, జెండాలను ప్రదర్శించడం పూర్తిగా ఫిఫా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఈ ఉల్లంఘనపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఫిఫా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం అర్జెంటీనా జట్టుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అర్జెంటీనా జట్టు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అర్జెంటీనా ఆటగాళ్లు సరిగ్గా ఇలాంటి ఫాక్లాండ్ బ్యానర్నే ప్రదర్శించి రచ్చ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఫిఫా, క్రీడా నియమాలను ఉల్లంఘించినందుకు గాను అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్పై 20 వేల పౌండ్ల భారీ జరిమానా విధించింది. ఇప్పుడు మళ్లీ అదే తప్పును పునరావృతం చేయడంతో, ఈసారి కేవలం జరిమానాతో సరిపెట్టకుండా ఆటగాళ్లపై నిషేధం విధిస్తారా లేక అంతకంటే కఠినమైన చర్యలు తీసుకుంటారా అనేది క్రీడా లోకంలో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
