Yashasvi Jaiswal : జైస్వాల్ జోరు.. రికార్డుల హోరు.. 20వ సారి 50+ స్కోరుతో దిగ్గజాల సరసన స్థానం
Yashasvi Jaiswal : ఐపీఎల్ 2026లో యశస్వి జైస్వాల్ మరోసారి రికార్డు సృష్టించాడు. పంజాబ్పై హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ తరపున 20 సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్లోకి చేరాడు.ఆడిన 76 మ్యాచుల్లో జైస్వాల్ 2,472 పరుగులు చేశాడు. 2500 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు.

Yashasvi Jaiswal : రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరోసారి బ్యాట్తో తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 51 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్, రాజస్థాన్ రాయల్స్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ సీజన్లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉన్నప్పటికీ, జైస్వాల్ మాత్రం తనదైన శైలిలో సైలెంట్ హీరోలా చెలరేగిపోతున్నాడు. తాజాగా సాధించిన ఈ ఫిఫ్టీతో రాజస్థాన్ తరపున అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన దిగ్గజాల జాబితాలో జైస్వాల్ చేరిపోయాడు.
రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు (50+ scores) చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి జైస్వాల్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 19 సార్లు ఈ ఘనత సాధించిన సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానేను జైస్వాల్ అధిగమించాడు. కేవలం 75 ఇన్నింగ్స్లలోనే జైస్వాల్ 20వ సారి 50+ మార్కును దాటడం విశేషం. ప్రస్తుతం ఇతని కంటే ముందు జోస్ బట్లర్ (25 సార్లు), సంజు శాంసన్ (25 సార్లు) మాత్రమే ఉన్నారు. జైస్వాల్ ఉన్న ఫామ్ను చూస్తుంటే త్వరలోనే వీరిద్దరి రికార్డులను కూడా తుడిచిపెట్టేలా కనిపిస్తున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక 50+ స్కోర్లు:
* 25 సార్లు – జోస్ బట్లర్ (82 ఇన్నింగ్స్లు)
* 25 సార్లు – సంజు శాంసన్ (144 ఇన్నింగ్స్లు)
* 20 సార్లు – యశస్వి జైస్వాల్ (75 ఇన్నింగ్స్లు)
* 19 సార్లు – అజింక్య రహానే (93 ఇన్నింగ్స్లు)
* 16 సార్లు – షేన్ వాట్సన్ (76 ఇన్నింగ్స్లు)
2500 పరుగుల మైలురాయికి చేరువలో
యశస్వి జైస్వాల్ ఐపీఎల్ కెరీర్ ఇప్పుడు సరికొత్త శిఖరాలను తాకుతోంది. ఇప్పటివరకు ఆడిన 76 మ్యాచుల్లో జైస్వాల్ 2,472 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో 28 పరుగులు చేస్తే ఐపీఎల్లో 2500 పరుగుల క్లబ్లో చేరిపోతాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది ఆటగాళ్లలో ఒకడిగా నిలుస్తాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో 306 పరుగులు చేసిన జైస్వాల్, ఆ జట్టు తరపున రెండో అత్యధిక స్కోరర్గా కొనసాగుతున్నాడు.
జైస్వాల్ – రాజస్థాన్ సైలెంట్ హీరో
ప్రస్తుతం అందరి దృష్టి 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. కానీ మైదానంలో నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలను అందిస్తున్నది మాత్రం జైస్వాల్. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా పవర్ప్లేలో జైస్వాల్ ఇచ్చిన ఆరంభం రాజస్థాన్ విజయానికి బాటలు వేసింది. వైభవ్ సూర్యవంశీ ఆకర్షణలో జైస్వాల్ ప్రతిభ మరుగున పడిపోతోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ జైస్వాల్ మాత్రం తన పని తాను చేసుకుంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
