AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup : ఉత్కంఠ రేపుతున్న మహిళా టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే

Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించాయి. జూన్ 30, జూలై 2న సెమీస్ జరగగా, జూలై 5న లార్డ్స్‌లో ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

Womens T20 World Cup : ఉత్కంఠ రేపుతున్న మహిళా టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
Womens T20 World Cup
Rakesh
|

Updated on: Jun 30, 2026 | 6:55 AM

Share

Womens T20 World Cup : ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 12 జట్లతో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఎన్నో ఉత్కంఠభరితమైన పోరాటాలు, మరికొన్ని ఏకపక్ష మ్యాచ్‌ల తర్వాత సెమీఫైనల్‌కు చేరే ఆ నాలుగు అదృష్ట జట్లు ఏవో తేలిపోయింది. అయితే భారత క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ టోర్నీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ప్రస్తుత వన్డే ఛాంపియన్ ఇండియా, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ జట్లు తమ తమ ఆఖరి మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓడిపోయి టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాయి. ఇప్పుడు కేవలం ఆతిథ్య ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు మాత్రమే ట్రోఫీ కోసం తలపడనున్నాయి.

ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12న మొదలైన ఈ ప్రపంచకప్ పోరులో ఇప్పుడు మిగిలిన నాలుగు జట్లలో మూడు జట్లు (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్) ఇదివరకే ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడిన అనుభవం ఉన్నవే. కానీ సౌతాఫ్రికా జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవలేదు. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి తృటిలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా ఆ చేదు జ్ఞాపకాలను తుడిచేసి, సరికొత్త చరిత్ర సృష్టించాలని లారా వోల్వార్డ్ నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు పట్టుదలతో ఉంది. అయితే ఈసారి కూడా ఆ జట్టుకు టైటిల్ గెలవడం అంత ఈజీ కాదనిపిస్తోంది.

సెమీఫైనల్ చేరిన జట్ల బలాబలాలను చూస్తే మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రూప్-1లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన పవర్‌ఫుల్ ఆస్ట్రేలియా జట్టుతో వెస్టిండీస్ తలపడనుంది. మహిళా టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇప్పటివరకు జరిగిన ప్రతి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాను అడ్డుకోవడం వెస్టిండీస్ మహిళలకు ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఈ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జూన్ 30న లండన్‌లోని ప్రసిద్ధ ది ఓవల్ మైదానంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.

ఇక జూలై 2న జరగబోయే రెండో సెమీఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో సౌతాఫ్రికా తలపడాల్సి ఉంది. గ్రూప్-2 లో టాపర్‌గా నిలిచి అందరికంటే ముందే సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉంది. స్వదేశీ పిచ్‌లపై ఆడుతుండటం, స్థానిక ప్రేక్షకుల మద్దతు పుష్కలంగా ఉండటం ఇంగ్లాండ్ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కూడా లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలోనే జూలై 2వ తేదీ రాత్రి 11 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

సెమీఫైనల్స్ ముగిసిన తర్వాత, విజేతలుగా నిలిచిన రెండు జట్లు క్రికెట్ మక్కాగా పిలవబడే చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జూలై 5న జరగబోయే మహా సంగ్రామంలో తలపడతాయి. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది మహిళా క్రికెట్ రాణి ఎవరో తేలిపోనుంది. గతంలో కప్పు గెలిచిన జట్లే మళ్లీ తమ ఖాతాలో మరో ట్రోఫీని వేసుకుంటాయా, లేదా సౌతాఫ్రికా రూపంలో ఈసారి సరికొత్త ఛాంపియన్ ఆవిర్భవిస్తాడా అనేది చూడాలి. ఏదేమైనా రాబోయే వారం రోజులు క్రికెట్ ప్రేమికులకు పండగే అని చెప్పవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us