Video: IND vs ENG మ్యాచ్‌లో మిస్టల్ కూల్ సందడి.. ధోనీ చెవిలో ఆ వింత పరికరం ఏంటో తెలుసా?

MS Dhoni Ear Device: మైదానంలో ఉన్నా, లేకపోయినా ధోనీ ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ రేడియో ఇయర్‌విగ్‌తో మరోసారి క్రీడాభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. క్రికెట్‌ను అతను ఎంతగా ఆరాధిస్తాడో చెప్పడానికి, మ్యాచ్‌ను ప్రతి క్షణం ఎంతలా ఆస్వాదిస్తాడో చెప్పడానికి ఈ చిన్న సంఘటనే ఓ గొప్ప ఉదాహరణ.

Video: IND vs ENG మ్యాచ్‌లో మిస్టల్ కూల్ సందడి.. ధోనీ చెవిలో ఆ వింత పరికరం ఏంటో తెలుసా?
Ind Vs Eng Ms Dhoni Ear Device

Updated on: Jul 15, 2026 | 1:45 PM

MS Dhoni Ear Device: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించిన వేళ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మ్యాచ్‌ను వీక్షిస్తూ సందడి చేశాడు. అయితే, విఐపి స్టాండ్స్‌లో కూర్చున్న ధోనీ చెవిలో కనిపించిన ఓ చిన్న పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఆ పరికరం ఏమిటి? దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం.. ధోనీ సందడి

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ తమ ఆటతీరుతో అదరగొట్టారు. అయితే, మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే కూడా విఐపి స్టాండ్స్‌లో కూర్చున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆకర్షణగా నిలిచాడు. తన సతీమణి సాక్షి ధోనీతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించిన ధోనీని కెమెరాలు పదే పదే చూపించడంతో అభిమానులు మురిసిపోయారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

ధోనీ చెవిలో ఆ పరికరం ఎందుకు?

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోనీ కుడి చెవిలో పెట్టుకున్న ఓ చిన్న పరికరం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అదేదో బ్లూటూత్ లేదా ఇయర్‌బడ్స్ అని చాలామంది అనుకున్నారు. కానీ, అది భారతీయ అభిమానులకు అంతగా పరిచయం లేని ఓ ప్రత్యేకమైన రేడియో ఇయర్‌పీస్. దీనిని ‘రేడియో ఇయర్‌విగ్’ (Radio Earwig) అని పిలుస్తారు. స్టేడియంలో కూర్చుని లైవ్ మ్యాచ్‌ను చూస్తూనే, ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని (కామెంటరీ) వినేందుకు ఈ బుజ్జి రేడియోను ఉపయోగిస్తారు. ధోనీ కూడా మ్యాచ్‌ను ఆస్వాదిస్తూనే, ఈ రేడియో ఇయర్‌విగ్ ద్వారా కామెంటరీని వింటూ ఎంజాయ్ చేశాడు.

ఈ పరికరం ప్రత్యేకతలు ఏంటి?

ఇంగ్లండ్ వంటి దేశాల్లోని క్రికెట్ స్టేడియాల్లో ఈ ‘రేడియో ఇయర్‌విగ్’ వాడకం చాలా సాధారణం. ఇది కేవలం స్టేడియం పరిధిలో మాత్రమే సిగ్నల్స్ అందుకునేలా రూపొందించబడింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 20 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. లార్డ్స్ లాంటి చారిత్రాత్మక స్టేడియాల్లో మ్యాచ్‌ను మరింత దగ్గరగా అనుభూతి చెందేందుకు అభిమానులు వీటిని కొనుగోలు చేస్తారు. ఇంగ్లండ్‌లో దీని ధర సుమారు 20 పౌండ్లు (మన కరెన్సీలో దాదాపు రెండు వేల రూపాయలు) ఉంటుంది. క్రికెట్‌లోనే కాకుండా హార్స్ రేసింగ్, రగ్బీ, ఫార్ములా 1 వంటి క్రీడల్లో కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

గతంలో మన ఆటగాళ్లు కూడా..

ధోనీ మాత్రమే కాదు, గతంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు చాలామంది భారత ఆటగాళ్లు ఈ రేడియో ఇయర్‌విగ్‌ను ఉపయోగించారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని దీని ద్వారానే కామెంటరీ వింటూ కనిపించారు. రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా గతంలో ఈ వైర్‌లెస్ రేడియోను వాడి మ్యాచ్‌ను ఆస్వాదించారు. మన దేశంలో స్టేడియాల్లో రేడియో ప్రసారాలకు అంతగా ప్రాచుర్యం లేకపోవడం వల్ల ఈ పరికరం గురించి ఇక్కడి అభిమానులకు పెద్దగా తెలియదు. కానీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఇది చాలా ప్రాచుర్యం పొందింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us