AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ గొడవకు అసలు కారణం ఇదే.. హెచ్చరికతో వదిలేస్తారా.. శిక్ష విధిస్తారా?

Vaibhav Sooryavanshi : శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గొడవ పడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.. అయితే లంక బౌలర్ చేసిన స్లెడ్జింగ్ వల్లే వైభవ్ సహనం కోల్పోయాడని, లంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా మధ్యలో రాకపోయి ఉంటే పరిణామాలు దారుణంగా ఉండేవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ గొడవకు అసలు కారణం ఇదే.. హెచ్చరికతో వదిలేస్తారా..  శిక్ష విధిస్తారా?
Vaibhav Sooryavanshi (2)
Rakesh
|

Updated on: Jun 16, 2026 | 7:15 AM

Share

Vaibhav Sooryavanshi : శ్రీలంక వేదికగా దాంబూలా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి ఆటగాడిని నెట్టేసిన ఉదంతం వెనుక అసలు కారణాలు బయటకు వచ్చాయి. సూపర్ ఓవర్ ఉత్కంఠలో ఇండియా-ఎ జట్టు ఓడిపోయిన తర్వాత లంక ఆటగాళ్లు మితిమీరిన వేడుకలు చేసుకోవడం, ముఖ్యంగా లంక బౌలర్ కుగాథస్ మథులన్ చేసిన తీవ్రమైన స్లెడ్జింగ్ (దూషణ) వల్లే ఈ గొడవ తారాస్థాయికి చేరినట్లు మ్యాచ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టుకు సూపర్ ఓవర్ లో గెలవడానికి 17 పరుగులు అవసరమయ్యాయి. లంక ఫాస్ట్ బౌలర్ కుగాథస్ మథులన్ వేసిన ఈ ఓవర్ లోని చివరి మూడు బంతులను వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్నాడు. ఒక బౌండరీతో సహా కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనివల్ల భారత్ కేవలం 9 పరుగులకే పరిమితమై, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన వెంటనే వైభవ్, అతడి తోటి ప్లేయర్ సూర్యాంశ్ శెడ్గే నిరాశగా పెవిలియన్ వైపు నడుస్తుండగా లంక టీమ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించింది.

మైదానంలో పెరిగిన వేడి.. డిక్వెల్లా ఎంట్రీ

చివరి మూడు బంతుల్లో వైభవ్‌ను విజయవంతంగా అడ్డుకున్న లంక బౌలర్ మథులన్.. 15 ఏళ్ల వైభవ్‌ను ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో విపరీతమైన కోపంతో వైభవ్ వెనక్కి తిరిగి సదరు బౌలర్ వైపు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో లంక ఫీల్డర్ విషేన్ హలంబెజ్ మధ్యలోకి రాగా, ఆగ్రహంతో ఉన్న వైభవ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. సదరు ఫీల్డర్ కూడా వైభవ్ వైపు దూసుకురావడంతో మైదానంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే పరిస్థితి కనిపించింది. అయితే, శ్రీలంక సీనియర్ అంతర్జాతీయ క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా త్వరగా స్పందించి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ పెద్దది కాకుండా ముగిసింది.

అంపైర్లతో తిలక్ వర్మ వాగ్వాదం.. వెనక్కి లాగిన కోచ్

నిజానికి ఈ మ్యాచ్ ముగిసే సమయంలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. బ్యాడ్ లైట్ కారణంగా లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. మొదట ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ నియమం లేదని భావించినప్పటికీ, భారత కెప్టెన్ తిలక్ వర్మ ఆన్-ఫీల్డ్ అంపైర్లతో సుదీర్ఘంగా, తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. దాదాపు 10 నిమిషాల చర్చల అనంతరం అంపైర్లు సూపర్ ఓవర్ కి అంగీకరించారు. ఈ చర్చల సమయంలో కూడా వైభవ్ సూర్యవంశీ దూకుడుగా కనిపించడంతో, భారత ముఖ్య కోచ్ హృషికేష్ కనిట్కర్ వెంటనే అతడిని వెనక్కి లాగి శాంతింపజేశారు. ఈ ఘర్షణపై మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రకాష్ ఆటగాళ్లకు అధికారికంగా శిక్ష విధిస్తారా లేక కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది చూడాలి.

వైభవ్ వైఫల్యం.. మిగిలిన వారి పోరాటం వృథా

మరోవైపు ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 21 పరుగులు) ఒక మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చడంలో విఫలమయ్యాడు. లంక ఫాస్ట్ బౌలర్ చమిక గుణశేఖర ఓవర్ లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, ఆఫ్ స్పిన్నర్ సాహన్ అరాచ్చిగే బౌలింగ్ లో పాయింట్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే, ఆల్ రౌండర్ సూర్యాంశ్ శెడ్గే (66 బంతుల్లో 72 పరుగులు), విప్రాజ్ నిగమ్ (49 బంతుల్లో 51 పరుగులు) అద్భుత హాఫ్ సెంచరీలతో రాణించి భారత స్కోరును 265 పరుగులకు చేర్చారు. లంక జట్టు ఈసారి అద్భుతంగా రాణించి విజయం సాధించగా, అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us