పాపం.. అప్పుడు సచిన్‌.. ఇప్పుడు ఖ్వాజా.. కెప్టెన్ల కఠిన నిర్ణయాలు.. అడుగుదూరంలో ఆగిపోయిన అరుదైన రికార్డులు

స్టేడియంలోని అభిమానులు కూడా ఖ్వాజా డబుల్ సెంచరీ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే అప్పుడే కెప్టెన్‌ పాట్ కమిన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. దీంతో మొదటిసారి డబుల్ సెంచరీ చేయాలన్న ఖ్వాజా కల 5 పరుగుల దూరంలో ఆగిపోయింది.

పాపం.. అప్పుడు సచిన్‌.. ఇప్పుడు ఖ్వాజా.. కెప్టెన్ల కఠిన నిర్ణయాలు.. అడుగుదూరంలో ఆగిపోయిన అరుదైన రికార్డులు
Sachin Tendulkar
Follow us

|

Updated on: Jan 07, 2023 | 12:42 PM

సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా అద్భుతంగా ఆడాడు. మొదట అర్ధ సెంచరీ.. ఆతర్వాత సెంచరీ.. ఆపై 150 పరుగులు పూర్తి చేశాడు. అయినా తన పరుగు ఆపలేదు. సఫారీ బౌలర్లను విసిగిస్తూ 195 పరుగులకు చేరుకున్నాడు. ఇక కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీ సాధించడమే తరువాయి. ఇందుకోసం మరింత ఏకాగ్రతగా బ్యాటింగ్‌ చేయసాగాడీ ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌. స్టేడియంలోని అభిమానులు కూడా ఖ్వాజా డబుల్ సెంచరీ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే అప్పుడే కెప్టెన్‌ పాట్ కమిన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. దీంతో మొదటిసారి డబుల్ సెంచరీ చేయాలన్న ఖ్వాజా కల 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. కెప్టెన్‌ తీసుకున్న ఈ షాకింగ్‌ నిర్ణయంతో ఖ్వాజా ఒకింత మనస్థాపానికి గురైనా, జట్టు ప్రయోజనాల కోసం చేసేదేమీ లేక సర్దుకుపోవాల్సి వచ్చింది. కమిన్స్‌ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో కమిన్స్‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు.

 19 ఏళ్ల క్రితం..

1960లో వెస్టిండీస్‌కు చెందిన ఫ్రాంక్ వోరెల్ 197 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్ గ్యారీ అలెగ్జాండర్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆ తర్వాత 2004లో, పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్ టెస్టులో సచిన్ టెండూల్కర్ 194 పరుగులతో ఆడుతున్నాడు. డబుల్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నాడు. అప్పుడే కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ద్రవిడ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. కమిన్స్‌ ఇన్నింగ్స్ డిక్లేర్‌ నేపథ్యంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా సిడ్నీ టెస్టుకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. ఇక నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా మొదటి సెషన్‌ పూర్తిగా రద్దైంది. లంచ్‌ పూర్తయ్యాక కానీ మ్యాచ్‌ ప్రారంభం కాలేదు. దీంతో చేసేదేమి లేక ఖ్వాజా 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు కమిన్స్‌. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే 475/4 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిం‍ది ఆసీస్‌. ఉస్మాన్‌ ఖ్వాజాతో పాటు స్టీవ్‌ స్మిత్‌ (104) , లబూషేన్‌ (79), ట్రవిస్‌ హెడ్‌ (70) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సఫారీలు కడపటి వార్తలందే సమయానికి 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..