AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! ఉప్పల్ స్టేడియంపై HCA ప్రెసిడెంట్ కీలక అప్డేట్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ 2025కు ముందుగా పునరుద్ధరణ పనులు జరుపుకుంటున్నాయి. HCA అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు మెరుగైన సౌకర్యాలను హామీ ఇచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభమవడంతో స్టేడియం భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్చి 23న SRH రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా, స్టేడియం నూతన రూపాన్ని సంతరించుకుంటోంది.

IPL 2025: సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! ఉప్పల్ స్టేడియంపై HCA ప్రెసిడెంట్ కీలక అప్డేట్
Uppal Stadium
Narsimha
|

Updated on: Mar 04, 2025 | 12:15 PM

Share

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం HCA కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో స్టేడియం పునరుద్ధరణ పనులు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (SJAT) 2025 వార్షిక డైరీని ఆవిష్కరించారు. HCA వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాసరావు డైరీని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో SJAT అధ్యక్షుడు ఆర్. కృష్ణా రెడ్డి, ఎం. శ్రీనివాస్ దాస్, ఉపాధ్యక్షుడు ఎస్.ఎస్‌బి సంజయ్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఐపీఎల్ 2025 సీజన్‌కు సిద్ధమవుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ప్రాక్టీస్ క్యాంప్‌ను ఉప్పల్ స్టేడియంలో ప్రారంభించింది. సోమవారం SRH ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. బ్యాటర్లు త్రో డౌన్స్, నెట్ బౌలర్లను ఎదుర్కొనగా, బౌలర్లు తమ రాణింపును మెరుగుపర్చేందుకు కృషి చేశారు. హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్ వంటి ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫీల్డింగ్ సెషన్‌లో ఆటగాళ్లు క్యాచ్ ప్రాక్టీస్, థ్రోయింగ్ టెక్నిక్స్ అభ్యసించారు. ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభమైన నేపథ్యంలో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల నియామకంతో పాటు CCTV కెమెరాలు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను పటిష్టంగా ఏర్పాటు చేశారు.

ఉప్పల్ స్టేడియాన్ని ఐపీఎల్ 2025 సీజన్‌కు సిద్ధం చేసే క్రమంలో పెయింటింగ్ వర్క్, టాయిలెట్ రినోవేషన్, స్టేడియం స్ట్రక్చర్ మెరుగుదల పనులు జరుగుతున్నాయి. ప్రేక్షకులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కూర్చొని చూసే ప్రాంతాలను పునర్నిర్మిస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్, మీడియా బాక్స్, VVIP లాంజ్ ప్రాంతాల్లోనూ మరమ్మతులు చేస్తున్నారు.

గత సీజన్‌లో SRH తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) చేతిలో ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి కప్పు సాధించాలని తీవ్రంగా సిద్ధమవుతోంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని SRH ఆటగాళ్లలో ఉత్సాహం కనిపిస్తోంది.

IPL 2025 మార్చి 22న ప్రారంభంకానుండగా, SRH తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో హోం గ్రౌండ్‌లో ఆడనుంది. మొత్తం ఏడుసార్లు ఉప్పల్ మైదానం వేదికగా SRH మ్యాచ్‌లు జరగనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.