AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma Record : 101 నాటౌట్.. గుజరాత్ 100 ఆలౌట్.. ముంబై గెలుపులో తిలక్ వర్మ సరికొత్త రికార్డు

Tilak Varma Record : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ 45 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ జట్టు కేవలం 100 పరుగులకే కుప్పకూలిపోయింది.

Tilak Varma Record : 101 నాటౌట్.. గుజరాత్ 100 ఆలౌట్.. ముంబై గెలుపులో తిలక్ వర్మ సరికొత్త రికార్డు
Tilak Varma Record
Rakesh
|

Updated on: Apr 21, 2026 | 9:56 AM

Share

Tilak Varma Record : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ యంగ్ సెన్సేషన్, మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ కేవలం సెంచరీతోనే సరిపెట్టుకోలేదు.. ఒక అరుదైన, కళ్లు చెదిరే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఒక బ్యాటర్ చేసిన పరుగులు, ప్రత్యర్థి జట్టు మొత్తం చేసిన స్కోరు కంటే ఎక్కువగా ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు తిలక్ వర్మ సరిగ్గా అదే చేసి చూపించి దిగ్గజాల సరసన చేరిపోయాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ 45 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ జట్టు కేవలం 100 పరుగులకే కుప్పకూలిపోయింది. అంటే, గుజరాత్ జట్టులోని 11 మంది కలిసి చేసిన పరుగుల కంటే, తిలక్ వర్మ ఒక్కడే చేసిన పరుగులే ఎక్కువ. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒక బ్యాటర్ తన సెంచరీతో ప్రత్యర్థి జట్టు స్కోరును దాటేయడం ఇది కేవలం 9వ సారి మాత్రమే.

ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన వారి జాబితాలో తిలక్ వర్మ ఇప్పుడు దిగ్గజాలైన క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సరసన చేరాడు. గతంలో 2008 తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే బ్రెండన్ మెక్‌కల్లమ్ 158 పరుగులు చేయగా, ఆనాడు ఆర్‌సీబీ జట్టు కేవలం 82 పరుగులకే అవుటైంది. అప్పటి నుంచి రాహుల్ ద్రవిడ్, క్రిస్ గేల్ (రెండు సార్లు), విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, జానీ బెయిర్‌స్టో, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు మన తెలుగు తేజం తిలక్ వర్మ కూడా ఈ ఎలైట్ క్లబ్‌లో చేరి తెలుగు క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటాడు.

ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు జట్టు కష్టాల్లో ఉన్న వేళ తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా, చివర్లో సిక్సర్ల సునామీతో స్కోర్ బోర్డును ఉరికించాడు. అతని ఇన్నింగ్స్ ధాటికి ముంబై 199 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు ముంబై బౌలర్ల ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు. శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజ బ్యాటర్లు ఉన్నా, గుజరాత్ టీమ్ కనీసం తిలక్ వర్మ చేసిన వ్యక్తిగత స్కోరును కూడా దాటలేకపోయింది. దీంతో ముంబై 99 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషీలో మునిగిపోయారు. వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టుకు తిలక్ వర్మ రూపంలో ఒక డైమండ్ దొరికిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిలక్ వర్మ పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన అని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు. భవిష్యత్తులో తిలక్ వర్మ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us