IND vs ENG: రోహిత్ సారధ్యంలో తొలిసారి.. ఇంగ్లండ్తో రేపే టీ20 పోరు.. ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?
India Vs England 1st T20: సౌతాంప్టన్లో ఇరుజట్ల మధ్య రేపు తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్లేయింగ్ XIలో ఎవరికి ఛాన్స్ దక్కనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్లో సమఉజ్జీలుగా నిలిచన భారత్, ఇంగ్లండ్ టీంలు పరిమిత ఓవర్ల సిరీస్లో తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ సౌతాంప్టన్లో (Ind vs Eng 1st T20I) జరగనుంది. ఈసారి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తలపడేందుకు సిద్ధమైంది. కరోనా నుంచి కోలుకోవడంతో రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు. రోహిత్ శర్మ టీ20 సిరీస్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీం ఇండియా ఏ ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగనుందనే ఆసక్తి నెలకొంది. తొలి టీ20లో విరాట్-బుమ్రా-పంత్ లాంటి ఆటగాళ్లు ఆడకపోతే రోహిత్ శర్మ ఏ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
భారత ప్లేయింగ్ XI ఎలా ఉండనుంది?
ప్లేయింగ్ XIలో రోహిత్ శర్మ పునరాగమనం చేయడంతో, రితురాజ్ గైక్వాడ్ జట్టు నుంచి నిష్క్రమించడం ఖాయమని భావిస్తున్నారు. రోహిత్తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్తో జరిగే తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో ఆడిన టీంతోనే బరిలోకి దిగొచ్చని అంటున్నారు. అంటే దీపక్ హుడాకు 3వ నంబర్లో అవకాశం ఇవ్వవచ్చు. సూర్యకుమార్ కూడా ప్లేయింగ్ XIలో భాగం కానున్నాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో దినేష్ కార్తీక్ వికెట్ కీపింగ్ పాత్రను పోషించనున్నాడు. అక్షర్ పటేల్ను ఆల్రౌండర్గా చేర్చనున్నారు. అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్లలో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్ త్రయం కనిపిస్తుంది. టీమ్ మేనేజ్మెంట్ ఉమ్రాన్ మాలిక్కు లేదా అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇస్తుందా లేదా అనేది ప్రశ్నగా మారింది.
భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI అంచనా..
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, అవేష్ ఖాన్.
భారత్-ఇంగ్లండ్ టీ20, వన్డే షెడ్యూల్
తొలి టీ20 మ్యాచ్ జులై 7న సౌతాంప్టన్లో జరగనుంది.
రెండో టీ20 జులై 9న బర్మింగ్హామ్లో జరగనుంది.
మూడో టీ20 జులై 10న నాటింగ్హామ్లో జరగనుంది.
వన్డే సిరీస్..
తొలి వన్డే జులై 12న కెన్నింగ్టన్ ఓవల్లో జరగనుంది.
రెండో వన్డే జులై 14న లార్డ్స్లో జరగనుంది
మూడో వన్డే జులై 17న మాంచెస్టర్లో జరగనుంది.
రోహిత్ తొలిసారి విదేశాల్లో కెప్టెన్గా..
రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు ఫుల్ టైమ్ కెప్టెన్గా మారి 7 నెలలు కావస్తున్నా, ఈ సమయంలో విదేశీ గడ్డపై ఒక్కసారి కూడా కెప్టెన్సీ చేయలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ విదేశీ గడ్డపై కెప్టెన్గా బరిలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు ముందు రోహిత్కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.