AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : గెలుస్తామనే ధీమా అప్పుడే వచ్చేసింది.. పాక్ ఓటమిపై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

IND vs PAK : టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే అదొక యుద్ధం లాంటిది. కానీ 2007 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరాటాలను చూస్తే ఫలితం ఎలా ఉంటుందో క్రికెట్ అభిమానులకు ఇట్టే అర్థమైపోతుంది.

IND vs PAK : గెలుస్తామనే ధీమా అప్పుడే వచ్చేసింది.. పాక్ ఓటమిపై సూర్యకుమార్  సంచలన వ్యాఖ్యలు
Surya Kumar Yadav
Rakesh
|

Updated on: Feb 16, 2026 | 6:52 AM

Share

IND vs PAK : టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే అదొక యుద్ధం లాంటిది. కానీ 2007 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరాటాలను చూస్తే ఫలితం ఎలా ఉంటుందో క్రికెట్ అభిమానులకు ఇట్టే అర్థమైపోతుంది. మీర్‌పూర్ నుంచి మెల్‌బోర్న్ వరకు, న్యూయార్క్ నుంచి ఇప్పుడు కొలంబో వరకు చరిత్ర పునరావృతమవుతూనే ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుతూ పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం అభిమానులకు పెద్ద ఆశ్చర్యం కలిగించకపోయినా, మైదానంలో ఉన్న ఆటగాళ్లకు మాత్రం ఒకానొక దశలోనే తమ విజయంపై పూర్తి నమ్మకం వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. అసలు గెలుపు ధీమా ఎప్పుడు కలిగిందో, గ్రౌండ్‌లో ఏం జరిగిందో సూర్య మాటల్లోనే తెలుసుకుందాం.

కొలంబోలో ఈశాన్ కిషన్ విధ్వంసం

కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15, ఆదివారం నాడు జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 175 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి టీమిండియాకు కొండంత స్కోరును అందించాడు. ఈ పిచ్‌పై 155 పరుగులు చేస్తేనే గట్టి పోటీ ఉంటుందని భావించిన తరుణంలో, ఈశాన్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల భారత్ మరో 20 పరుగులు అదనంగా సాధించింది. ఈ స్కోరు చూసినప్పుడే సూర్యకుమార్ యాదవ్‌కు గెలుపుపై ఒక క్లారిటీ వచ్చేసింది. పాకిస్థాన్ లాంటి ఒత్తిడికి లోనయ్యే జట్టుకు 176 పరుగుల లక్ష్యం అంటే కొండను ఎక్కడం లాంటిదేనని సూర్య అప్పుడే గ్రహించారు.

బుమ్రా, హార్దిక్ బౌలింగ్ మ్యాజిక్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. హార్దిక్ పాండ్యా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తొలి ఓవర్ వేసి, మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి పాక్ పతనాన్ని ప్రారంభించాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగి తన తర్వాతి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు. బుమ్రా వేసిన ఆ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని దాదాపు ఖరారు చేసేసింది. బుమ్రా ఎందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరో మరోసారి నిరూపించుకున్నాడని కెప్టెన్ సూర్య కొనియాడారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలోనే కేవలం 114 పరుగులకు కుప్పకూలిపోయింది.

సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్

మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మొదట బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత స్కోరు సరిపోతుందో చెప్పడం కష్టం. కానీ మేము 175 పరుగులకు చేరుకోగానే, మాకు గెలుపు ధీమా వచ్చేసింది. ఈ పిచ్‌పై ఇది అవసరమైన దానికంటే 15-20 పరుగులు ఎక్కువే. మా బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తారని నాకు తెలుసు. హార్దిక్ ఇచ్చిన ఆరంభం, బుమ్రా వేసిన స్పెల్ మ్యాచ్‌ను మా వైపు తిప్పేశాయి” అని సూర్య ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయంతో భారత్ హ్యాట్రిక్ కొట్టి సూపర్-8 దశకు చేరుకుంది. మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

సూపర్-8 లోకి భారత్ ఘనంగా..

ఈ విజయంతో టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌పై 61 పరుగుల భారీ తేడాతో గెలవడం వల్ల నెట్ రన్ రేట్ కూడా అమాంతం పెరిగింది. బ్యాటింగ్‌లో ఈశాన్ కిషన్, బౌలింగ్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్యా సమిష్టిగా రాణించడం భారత్‌కు ప్లస్ పాయింట్ అయ్యింది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యూహాలు పక్కాగా అమలు కావడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి ఇదే ఊపుతో భారత్ సెమీఫైనల్, ఫైనల్స్ చేరుకుని ట్రోఫీని ముద్దాడుతుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..