Smriti Mandhana : 9 మ్యాచుల్లో 434 రన్స్.. వరల్డ్ కప్ గెలిపించినా స్మృతి మంధానకు భారీ షాక్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ 2025 విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు ఊహించని షాక్ తగిలింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా నిలిచినప్పటికీ ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆమె నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది.

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ 2025 విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు ఊహించని షాక్ తగిలింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా నిలిచినప్పటికీ ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆమె నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్, ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించడంతో మంధానను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్కు గర్వకారణంగా నిలిచిన స్మృతి మంధాన.. ర్యాంకింగ్స్లో ఎలా వెనుకబడింది..లారా వోల్వార్డ్ దూకుడు వివరాలు ఇప్పుడు చూద్దాం.
భారత మహిళా జట్టు ప్రపంచకప్ 2025లో విజయం సాధించిన తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానంలో మార్పు చోటు చేసుకుంది. చాలా కాలంగా నంబర్ 1 స్థానంలో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధాన, ఇప్పుడు 811 రేటింగ్ పాయింట్లు సాధించి రెండో స్థానానికి పడిపోయింది. ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్, 814 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.
ప్రపంచకప్లో స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్ను ప్రదర్శించింది. ఆమె భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. స్మృతి మంధాన టోర్నమెంట్లో ఆడిన 9 మ్యాచ్ల్లో 54.25 సగటుతో మొత్తం 434 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్లో కూడా ఆమె 45 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ స్మృతి మంధాన కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లు సాధించడం వలన, స్మృతి మంధాన తన నంబర్ 1 కిరీటాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ ప్రపంచకప్లో బ్యాట్తో సంచలనం సృష్టించింది. ఆమె జట్టు ఫైనల్ ఓడినప్పటికీ, ఆమె వ్యక్తిగత ప్రదర్శన అసాధారణంగా ఉంది. లారా వోల్వార్డ్ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. భారత్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా ఆమె సెంచరీ సాధించి, ఒంటరి పోరాటం చేసింది. అయితే, మిగిలిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు హాఫ్ సెంచరీలు కూడా చేయలేకపోయారు. ఆమె అద్భుతమైన స్థిరత్వం కారణంగానే వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానం దక్కింది.




