దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర అతి తక్కువగా ఉందో తెలుసా..? తెలుగురాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..
సామాన్యుడి వంటింట్లో గ్యాస్ మంటలు రేగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సెగ దేశీయ సిలిండర్ ధరలకు తగులుతోంది. మార్చి 12 నాటి తాజా లెక్కల ప్రకారం.. కొన్ని నగరాల్లో గ్యాస్ ధరలు వెయ్యి రూపాయల మార్కును దాటేయగా, మరికొన్ని చోట్ల ఉపశమనం లభిస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో గ్యాస్ ధర తక్కువ ఉందో తెలుసుకుందాం..

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒడిదుడుకులు, దిగుమతి ఖర్చుల కారణంగా దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి, చమురు సంస్థలు మార్చి నెలలో ధరలను సవరించాల్సి వచ్చింది. దీని ప్రభావంతో మార్చి 12 నాటికి దేశంలోని అనేక నగరాల్లో సిలిండర్ ధరలు సామాన్యుల బడ్జెట్కు భారంగా మారాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యల్పంగా గ్యాస్ సిలిండర్ లభిస్తున్న నగరం చండీగఢ్. ఇక్కడ 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.862.50 గా ఉంది. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో రూ.910.50, ముంబైలో రూ.912.50, దేశ రాజధాని ఢిల్లీలో రూ.913 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో రూ.916.50, హర్యానాలోని గుర్గావ్లో రూ.921.50 గా ధరలు నమోదయ్యాయి.
దక్షిణ భారత నగరాల విషయానికి వస్తే.. హైదరాబాద్లో గ్యాస్ ధరలు ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సిలిండర్ ధర రూ.965 కు చేరుకోవడం గమనార్హం. ఇది తమిళనాడు రాజధాని చెన్నై రూ.928.50, కర్ణాటక రాజధాని బెంగళూరు రూ.915.50, కేరళలోని తిరువనంతపురం రూ.922 కంటే చాలా ఖరీదైనది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కూడా ధర రూ.950.50 గా ఉంది.
ఇక దేశంలోనే అత్యధిక గ్యాస్ ధరలు ఉన్న నగరంగా బీహార్ రాజధాని పాట్నా నిలిచింది. ఇక్కడ సిలిండర్ ధర ఏకంగా రూ.1,002.50కు పెరిగింది. ప్రధాన నగరాల్లో వెయ్యి రూపాయల మార్కును దాటిన ఏకైక నగరం పాట్నా కావడం విశేషం. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, ఒడిశాలోని భువనేశ్వర్లో ధరలు రూ.939 వద్ద ఉన్నాయి. ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి, పేద కుటుంబాల వంటింటి బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
