AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: టీమిండియా డబ్ల్యూటీసీ ఆశలు గాల్లో కలిసిపోయాయా ? కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్

Shubman Gill: శ్రీలంకతో కొలంబో టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. విజయ శాతం 51.51కి పడిపోయి భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆశలు వదులుకోలేదు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుతామని ధీమా వ్యక్తం చేశాడు. వరుస విజయాలు సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

Shubman Gill: టీమిండియా డబ్ల్యూటీసీ ఆశలు గాల్లో కలిసిపోయాయా ? కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్
Shubman Gill
Rakesh
|

Updated on: Aug 28, 2026 | 9:09 AM

Share

Shubman Gill: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలనే భారత జట్టు కల తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ నిరాశాజనక ఫలితం తర్వాత జట్టు ఫైనల్ ఆశలపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నోరు విప్పారు. రాబోయే న్యూజిలాండ్ పర్యటనపైనే తమ ధ్యాసంతా ఉందంటూ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించేలా మాట్లాడారు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ, చివరి కొలంబో టెస్టు డ్రా కావడం జట్టు అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. గెలిచి ఉంటే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఈ మ్యాచ్ ఫలితంతో భారత గెలుపు శాతం 53.33 నుంచి 51.51 శాతానికి పడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలోనే ఉండిపోయింది. ఫైనల్ రేసులో ముందంజ వేయాల్సిన సమయంలో ఈ డ్రా జట్టును తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టివేసింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుపై గిల్ ఏమన్నాడంటే?

మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “మేము నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. అది మాకు చాలా కీలకమైన సిరీస్. ఆ తర్వాత స్వదేశంలో కూడా మంచి సిరీస్ ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో మేము మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాం. అవకాశం ఉన్నంత వరకు మేము ఫైనల్ చేరగలమని ఖచ్చితంగా నమ్ముతున్నాం” అని గిల్ స్పష్టం చేశారు. ఆటగాళ్లందరూ రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పాయింట్ల పట్టికలో 5వ స్థానం

ప్రస్తుతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఆస్ట్రేలియా 80 శాతం విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షణాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో ఉంది. భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తమ విజయాల శాతాన్ని కనీసం 60 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ముందుకు వెళ్లాలంటే రాబోయే మ్యాచ్‌లలో భారత్ వరస విజయాలు సాధించడం మినహా వేరే మార్గం లేదు.

రెండోసారి ఫైనల్ మిస్సయ్యే ప్రమాదం

గత డబ్ల్యూటీసీ సైకిల్లో కూడా టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. అంతకుముందు మొదటి రెండు సీజన్లలో ఫైనల్ దాకా వెళ్లినప్పటికీ ట్రోఫీని గెలవలేకపోయింది. మొదటి సీజన్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో, రెండో సీజన్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు వరుసగా రెండోసారి టోర్నీ ఫైనల్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదం పొంచి ఉండటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాబోయే న్యూజిలాండ్ పర్యటన భారత టెస్టు జట్టు భవిష్యత్తును తేల్చనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us