AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఆడింది 4.. గెలిచింది 0.. ఎవ్వరూ కోరుకోని చెత్త లిస్ట్‌లో సర్పంచ్ సాబ్..!

Shreyas Iyer Captaincy: సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఈ యూరప్ పర్యటన పెద్ద పరీక్షగా మారింది. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టుగా ఉన్న భారత జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది.

Team India: ఆడింది 4.. గెలిచింది 0.. ఎవ్వరూ కోరుకోని చెత్త లిస్ట్‌లో సర్పంచ్ సాబ్..!
Shreyas Iyer Captaincy Records
Venkata Chari
|

Updated on: Jul 05, 2026 | 3:10 PM

Share

Shreyas Iyer Captaincy: ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెనుకబడటమే కాకుండా, భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక అత్యంత నిరాశాజనకమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విజయ రికార్డుపై ఈ ప్రభావం పడింది.

భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ కెప్టెన్లు తమదైన ముద్ర వేశారు. కానీ ప్రస్తుత టీ20 సారథి శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం కెప్టెన్సీ కెరీర్ ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చవిచూడటంతో, అయ్యర్ కెప్టెన్సీలో ఒక అవాంఛనీయ రికార్డు నమోదైంది.

Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!

ఇవి కూడా చదవండి

భారీ స్కోరు చేసినా దక్కని విజయం..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు పట్టుదలగా ఆడి బోర్డుపై మంచి స్కోరును ఉంచారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 43 పరుగులతో రాణించగా, ఇషాన్ కిషన్ 49 పరుగులతో మెరిశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బాధ్యతాయుతంగా ఆడి 37 పరుగులు జోడించారు. చివరి ఓవర్లలో తిలక్ వర్మ కేవలం ఒకే ఓవర్లో 17 పరుగులు రాబట్టి, మొత్తం 24 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది.

బౌలింగ్ వైఫల్యం.. చేజారిన మ్యాచ్

191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ప్రారంభంలోనే భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాక్ ఇచ్చాడు. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్‌లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. అయితే హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి ఇంగ్లండ్ వైపు మ్యాచ్‌ను తిప్పాడు. ఆ తర్వాత జాకబ్ బెథెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 46 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ ఓవర్లో రెండు నో-బాల్స్‌తో సహా ఏకంగా 29 పరుగులు సమర్పించుకోవడంతో ఇంగ్లండ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.

శ్రేయస్ అయ్యర్ పేరిట నిరాశాజనక రికార్డు..

ఈ ఓటమితో శ్రేయస్ అయ్యర్ భారత క్రికెట్ చరిత్రలోనే ఒక నిరాశాజనక జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. టీ20 ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన ఏకైక భారత సారథిగా అయ్యర్ నిలిచారు.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

గతంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో రెండో మ్యాచ్‌లోనే తొలి విజయాన్ని నమోదు చేశారు. రిషభ్ పంత్ తన మూడో మ్యాచ్‌లో గెలుపు రుచి చూశారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ వంటి వారు కెప్టెన్‌గా చేసిన మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించారు. కానీ అయ్యర్ సారథ్యంలో భారత్ మొదట ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఈ యూరప్ పర్యటన పెద్ద పరీక్షగా మారింది. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టుగా ఉన్న భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. అయితే సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున, రాబోయే మ్యాచ్‌ల్లో టీమిండియా పునరాగమనం చేసి, అయ్యర్ తన కెప్టెన్సీలో మొదటి విజయాన్ని నమోదు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us