టీమిండియా క్రికెటర్లు భారతీయులం అని నిరూపించుకునేందుకు ఆరాట పడుతున్నారు: షాహిద్ అఫ్రిదీ
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ, భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్ల ద్వంద్వ వైఖరిని, పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటంపై భారత్ వైఖరిని విమర్శించారు. అఫ్రిదీ, ఇర్ఫాన్ పఠాన్పై పరోక్షంగా విమర్శలు చేస్తూ, కొంతమంది భారత క్రికెటర్లు తమ భారతీయతను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

భారత్, పాకిస్థాన్ మ్యాచ్కి ముందు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న అంటే ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న అఫ్రిదీ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. కొంతమంది టీమిండియా క్రికెటర్లు తాము భారతీయులం అని నిరూపించుకునేందుకు ఆరాట పడుతున్నారని అన్నాడు.
అలాగే పాకిస్థాన్తో భారత్ క్రికెటర్ ఆడేందుకు వేదికలు, టోర్నమెంట్లు అంటూ భారత్ సాకులు చెబుతోందని విమర్శించారు. ఇలా ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదని అన్నాడు. ఆసియా కప్లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడొద్దనే డిమాండ్ వ్యక్తం అయినప్పటికీ.. బీసీసీఐ పాక్తో మ్యాచ్కు ఓకే చెప్పింది. కానీ, అంతకంటే ముందు రిటైర్డ్ ఆటగాళ్లు పాల్గొన్న లెజెండ్స్ టోర్నీలో మాత్రం భారత మాజీ క్రికెటర్లు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు.
లీగ్ దశలో ఒక మ్యాచ్లో, అలాగే సెమీ ఫైనల్ మ్యాచ్ను పాకిస్థాన్తో ఆడాల్సి ఉండగా.. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని టీమిండియా తమకు దేశం ముఖ్యం అంటూ పాకిస్థాన్తో మ్యాచ్ను రద్దు చేసుకుంది. దీనిపై ఆ టోర్నీలో పాక్ కెప్టెన్గా వ్యవహరించిన అఫ్రిదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆడని వాళ్లు, ఇప్పుడు ఆసియా కప్లో పాకిస్థాన్తో ఎలా ఆడతారంటూ ప్రశ్నించాడు. ఈ ద్వంద్వ వైఖరి సరికాదని, పూర్తిగా పాకిస్థాన్తో క్రికెట్ ఆడటమే మానుకోవాలని కూడా అన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




