Sachin vs Kohli: సచిన్ కంటే కోహ్లీనే తోపు.. ఏం వాగుతున్నావ్ బ్రో..సౌతాఫ్రికా దిగ్గజం పై నెటిజన్లు ఫైర్
Sachin vs Kohli: విదేశీ పిచ్లపై సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ మెరుగని ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై మాజీ భారత పేసర్ దొడ్డ గణేష్ ఘాటుగా స్పందించాడు. సచిన్ అభిమానులు, నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో డివిలియర్స్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Sachin vs Kohli: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక పెడుతూ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విదేశీ పిచ్లపై సచిన్ కంటే కోహ్లీనే అత్యుత్తమమని డివిలియర్స్ కామెంట్ చేయగా, టీమిండియా మాజీ పేసర్ దొడ్డ గణేష్ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తూ ఘాటు కౌంటర్ ఇచ్చాడు. సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇటీవల యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ భారత క్రికెట్ దిగ్గజాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. విదేశాల్లో సీమ్, బౌన్స్ ఉన్న కఠినమైన పరిస్థితుల్లో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే ఎంతో బాగా ఆడాడని అభిప్రాయపడ్డాడు. ఉపఖండపు బ్యాటర్లు విదేశీ పిచ్లపై పరుగులు చేయగలరని సచిన్ బాట వేసి చూపించినప్పటికీ, విరాట్ ఆ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లాడని వ్యాఖ్యానించాడు. విరాట్ ప్రదర్శన సచిన్ను మించిపోయిందని చెప్పడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది.
డివిలియర్స్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించాడు. ఏబీ డివిలియర్స్ కామెంట్స్కు కౌంటర్ ఇస్తూ, “కొంచెం ఆ గంజాయిని పక్కన పెట్టు బ్రదర్” అంటూ ఎక్స్ వేదికగా వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. విదేశాల్లో పేస్, బౌన్స్కు అనుకూలించే కఠినమైన పిచ్లపై సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను, ఆయన ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్లను మర్చిపోయి ఇలా మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
డివిలియర్స్ తన వ్యాఖ్యల్లో కేవలం సచిన్, కోహ్లీలను మాత్రమే కాకుండా ప్రస్తుత తరం ఆటగాళ్ల గురించి కూడా ప్రస్తావించాడు. సచిన్, విరాట్లు చూపించిన దారిలోనే కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ లాంటి యువ ఆటగాళ్లు పయనిస్తున్నారని చెప్పాడు. అయితే కేఎల్ రాహుల్ విదేశీ గడ్డపై మరింత మెరుగ్గా ఆడాల్సి ఉందని సూచించాడు. రాహుల్కు మంచి టెక్నిక్ ఉన్నప్పటికీ విదేశాల్లో అతని సగటు కేవలం 34గా మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుచేశాడు. సెంచరీలు సాధించినప్పుడు వాటిని 180 ప్లస్ భారీ స్కోర్లుగా మార్చితేనే రాహుల్ మరింత గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని డివిలియర్స్ విశ్లేషించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
