Test Captain: అయ్యగారే కరెక్టు… ఆయనే నెంబర్ వన్! టెస్ట్ కెప్టెన్ పై టీమిండియా దిగ్గజ స్పిన్నర్!
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత టెస్ట్ జట్టులో నాయకత్వ విషయంలో ఉత్కంఠ నెలకొంది. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, బుమ్రా నాయకత్వాన్ని సమర్థిస్తూ అతడే సరైన ఎంపిక అన్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే బుమ్రా గాయాల సమస్యల నేపథ్యంలో ఇతర ఆటగాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రోహిత్ టెస్ట్ కెరీర్ దశాబ్దకాలం పాటు గొప్ప రికార్డులతో నిలిచిందని స్పష్టమవుతోంది.

భారత క్రికెట్లో మరో కీలక మలుపు వచ్చింది. జూన్ 20 నుండి ఇంగ్లాండ్ గడ్డపై ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్తో భారత్ తన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో, భారత టెస్ట్ జట్టులో నాయకత్వ మార్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రోహిత్ శర్మ బుధవారం తన టెస్ట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు కెప్టెన్గా ఉన్న ఆయన హఠాత్ రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోహిత్ నిర్ణయం భారత జట్టులో పెద్ద శూన్యతను మిగిల్చింది. కేవలం ఓ ప్రతిభావంతమైన బ్యాట్స్మన్నే కాదు, సమర్థవంతమైన నాయకుడినీ కోల్పోయినట్టైంది. ఈ తరుణంలో జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది.
ఈ సిరీస్కు సంబంధించి ఇంకా అధికారికంగా కెప్టెన్ను ప్రకటించలేదు కానీ, భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆయన ప్రకారం, జట్టును జస్ప్రీత్ బుమ్రా నడిపించాలన్నది తన అభిప్రాయం. ‘‘బుమ్రాతో వెళ్లడం మంచిదని నాకు అనిపిస్తోంది. అతను ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి. అతను ఓ ఫాస్ట్ బౌలర్. గాయాల నుండి తిరిగొచ్చాడు. IPLలో తిరిగి వచ్చాడు. అయినా కూడా అతనిపై నాకు నమ్మకం ఉంది,’’ అని కుంబ్లే పేర్కొన్నాడు. అయితే బుమ్రా ఐదు టెస్టులను వరుసగా ఆడడం కష్టం అనే విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. ‘‘అప్పటివరకు వైస్ కెప్టెన్ జట్టును నడిపిస్తాడు’’ అన్నారు కుంబ్లే.
ఇటీవల భారత్ తరపున టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశమున్న వారిలో జస్ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా రెండు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించడంతో అతనికి అనుభవం ఉన్నప్పటికీ, తరచూ గాయాలు అతడి కెప్టెన్సీ అవకాశాలపై ప్రశ్నార్థకాన్ని మిగులుస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కెఎల్ రాహుల్ లేదా శుభ్మాన్ గిల్లకు అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ భారత క్రికెట్కు ఎంతో విశేషంగా సేవలందించిన లెజెండ్. నాలుగు ఐసిసి ఫైనల్స్కు జట్టును నడిపించి, రెండు టైటిల్స్ను గెలిపించిన ఘనత అతనికి చెందుతుంది. వన్డేల్లో 11,000కు పైగా పరుగులు, 32 సెంచరీలు చేసిన రోహిత్, టెస్టుల్లోనూ తన రెండవ ఇన్నింగ్స్లో సత్తాచాటాడు. 67 టెస్టుల్లో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో 4301 పరుగులు చేయడం ద్వారా తన కెరీర్ను ముద్ర వేసుకున్నాడు.
పిటిఐ నివేదికల ప్రకారం, రోహిత్ ఇప్పటికే మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టెస్టుల నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఆయన రిటైర్మెంట్ గురించి అధికారికంగా ముందుగానే ప్రకటించకపోవడం, మీడియాలో ఊహాగానాలకు దారితీసింది. పైగా, రాబోయే ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక విషయంలో సెలక్షన్ కమిటీ రోహిత్కు స్పష్టత ఇవ్వకపోవడంతో, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకున్నారని సమాచారం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..