ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త కెప్టెన్.. ఆటలో జీరో.. ఓవర్ యాక్షన్లో హీరో..!
Riyan Parag Criticized by K Srikanth: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్తో జరిగిన పోరులో రాజస్థాన్ ఘోర పరాజయం పొందింది. అయితే, ఈ ఓటమి కంటే కూడా ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రదర్శనతోపాటు నాయకత్వ లోపాలపై మాజీ బీసీసీఐ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన విమర్శలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

Riyan Parag Criticized by K Srikanth: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం భారత 1983 ప్రపంచకప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా రియాన్ పరాగ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పరాగ్ కేవలం మైదానంలో స్టైల్ చూపించడానికే పరిమితమవుతున్నాడని, బ్యాట్తో జట్టుకు ఒక్క పరుగు కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. ముఖ్యంగా మ్యాచ్ అనంతరం పరాగ్ ఇచ్చిన వివరణలను శ్రీకాంత్ తప్పుబట్టారు.
జడేజాను వాడకపోవడంపై విస్మయం..
సన్రైజర్స్ బ్యాటర్లు విరుచుకుపడుతున్న సమయంలో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాతో బౌలింగ్ చేయించకపోవడంపై శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రీజులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారనే కారణంతో జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదని పరాగ్ చెప్పడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. “ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఎడమచేతి బ్యాటర్లకు బౌలింగ్ చేయకూడదని ఎక్కడైనా నియమం ఉందా? ఇదంతా కేవలం కుంటిసాకు మాత్రమే” అని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.
బౌలర్ల వైఫల్యం..
ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తమ 11 ఓవర్లలో ఏకంగా 142 పరుగులు సమర్పించుకోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. రాజస్థాన్ జట్టు తమ బౌలింగ్ కూర్పును తక్షణమే మార్చుకోవాలని, లేనిపక్షంలో మిగిలిన మ్యాచ్ల్లో కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కెప్టెన్సీ భారమా? పేలవమైన గణాంకాలు..
సంజూ శామ్సన్ నిష్క్రమణ తర్వాత రాజస్థాన్ బాధ్యతలు చేపట్టిన పరాగ్, ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ల్లో కేవలం 49 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 12.25గా ఉండటం అతని ఫామ్పై ఆందోళన కలిగిస్తోంది. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కూడా పరాగ్ కేవలం 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. పరాగ్ తన వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
