Manu Bhaker : ఒలింపిక్ విజేతను పట్టుకుని క్రికెట్ గురించి అడుగుతారా? వైరల్ అవుతున్న మను బాకర్ ఇంటర్వ్యూ

Manu Bhaker : భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదనేది పచ్చి నిజం. కానీ ఒలింపిక్ విజేతలను కూడా క్రికెట్ గురించి మాట్లాడమని అడగడం అంటే వారి క్రీడను చిన్నచూపు చూడటమేనని నెటిజన్లు వాదిస్తున్నారు. షూటింగ్ స్టార్ మను బాకర్‌కు ఎదురైన ఒక వింత ప్రశ్న ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

Manu Bhaker : ఒలింపిక్ విజేతను పట్టుకుని క్రికెట్ గురించి అడుగుతారా? వైరల్ అవుతున్న మను బాకర్ ఇంటర్వ్యూ
Manu Bhaker

Updated on: Apr 28, 2026 | 9:39 AM

Manu Bhaker : ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఒక చాంపియన్‌ను గౌరవించాల్సింది పోయి, ఆమెకు సంబంధం లేని మరో క్రీడ గురించి ప్రశ్నలు అడగడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. షూటింగ్ స్టార్ మను బాకర్‌కు ఎదురైన ఒక వింత ప్రశ్న ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. క్రికెట్ పిచ్చితో ఇతర క్రీడాకారుల అస్థిత్వాన్ని మీడియా మర్చిపోతోందా అనే చర్చకు ఇది దారితీసింది.

అసలేం జరిగిందంటే?

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) 75వ వార్షికోత్సవ వేడుకలకు ఒలింపిక్ పతక విజేత మను బాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఘనత ఆమెది. అయితే అక్కడ ఆమెను షూటింగ్ గురించి కాకుండా 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్నలు అడిగారు మీడియా ప్రతినిధులు. దానికి ఆమె చాలా హుందాగా..”వయసు కేవలం అంకె మాత్రమే, సరైన గైడెన్స్ ఉంటే అతను పెద్ద స్టార్ అవుతాడు” అని సమాధానం చెప్పారు. కానీ ఒక ఒలింపిక్ విజేతను ఇలాంటి ప్రశ్న అడగడంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు.

నిపుణుల ఘాటు విమర్శలు

కేకేఆర్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ ఘటనపై ఎక్స్‌లో తీవ్రంగా స్పందించారు. “ఆమె ఒక ఒలింపిక్ మెడలిస్ట్. ఆమెను వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఆమె సాధించిన విజయాలను కించపరచడమే. కేవలం హెడ్‌లైన్స్ కోసం ఇలాంటివి చేయకండి. ఒకవేళ ధైర్యం ఉంటే సూర్యవంశీని మను బాకర్ గురించి అడగండి, అప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం” అని చురకలు అంటించారు.

క్రికెట్ ఆధిపత్యంపై చర్చ

భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదనేది పచ్చి నిజం. కానీ ఒలింపిక్ విజేతలను కూడా క్రికెట్ గురించి మాట్లాడమని అడగడం అంటే వారి క్రీడను చిన్నచూపు చూడటమేనని నెటిజన్లు వాదిస్తున్నారు. “క్రికెటర్లను ఎప్పుడైనా షూటింగ్ విజేతల గురించి అడుగుతారా?” అని నిలదీస్తున్నారు. మను బాకర్ సాధించిన ఘనత వెలకట్టలేనిదని, ఆమెను కేవలం క్రికెట్ అప్‌డేట్స్ కోసం వాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే టీ20ల్లో 1000 పరుగులు చేయడమే కాకుండా, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రెండు సెంచరీలు బాదాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. అతను మంచి క్రికెటర్ అనడంలో సందేహం లేదు, కానీ మను బాకర్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్‌ను అతని గురించి రివ్యూ అడగడమే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us