
న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఘోర పరాజయం తర్వాత తదుపరి టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ నాయకత్వంలోని టీమిండియా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుండగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాతో కలిసి ఆసీస్లో పర్యటించినప్పటికీ.. తొలి టెస్టులో ఆడడంపై అనుమానాలు వస్తుండటంతో టెస్టు సిరీస్కు ముందే టీమిండియాలో టెన్షన్ మొదలైంది.
పెర్త్లో జరిగే తొలి టెస్టులో రోహిత్ శర్మ ఆడడం అనుమానంగా మారింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ టెస్ట్కు అందుబాటులో ఉండనంటూ రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి చెప్పుకొచ్చాడు. దీంతో అతడి గైర్హాజరీలో మరో ఓపెనర్ జైస్వాల్తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలని కలలు కంటున్న టీమిండియా 4 మ్యాచ్లు గెలవాల్సి ఉండగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ టీమ్ ఇండియాకు కీలకం కానుంది. దీంతో అన్ని రంగాలో పటిష్టమైన జట్టును రంగంలోకి దింపేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. రోహిత్ శర్మ తొలి టెస్టు మ్యాచ్లో ఆడడం అనుమానమేనని బీసీసీఐతో పాటు టీమ్ మేనేజ్మెంట్కు తెలుసు. దీంతో రోహిత్ ప్లేస్ ను భర్తీ చేసే ఆటగాడు ఎవరా అని అందరూ ఆలోచనలో పడ్డారు. తొలి టెస్టు మ్యాచ్లో రోహిత్ గైర్హాజరీని భర్తీ చేసేందుకు ముగ్గురు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.
రంజీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన అభిమన్యు ఈశ్వరన్ ఈ సిరీస్కు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా Aతో జరిగిన అనధికారిక టెస్టులో అతను పరుగులు సాధించలేకపోయినప్పటికీ, అతను కెప్టెన్, కోచ్ ఫస్ట్ ఛాయిస్ గా ఎంపికయ్యాడు.
ఇక టీమిండియాలో నిలకడ లేక సతమతమవుతున్న కేఎల్ రాహుల్ టీమ్ ఇండియా సెకండ్ ఛాయిస్ ఓపెనర్గా కనిపించవచ్చు. కేఎల్ లో ప్రస్థుతం నిలకడ లేకపోయినప్పటికి విదేశీ పిచ్లపై ఆడిన అనుభవం ఆధారంగా అతడిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఆస్ట్రేలియా టూర్లో టీమ్ ఇండియా రిస్క్లు తీసుకోకూడదనుకుంటే ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్కు ప్రమోషన్ ఇవ్వవచ్చు. భారత జట్టులో శుభ్మన్ గిల్ మూడో ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇన్నింగ్స్ను ఓపెనింగ్ చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే, టీమ్ మేనేజ్మెంట్ అతడిని కోరుకుంటే గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆశ్చర్యపోనక్కర్లేదు.