PM Modi: రంజీలో జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
Jammu and Kashmir Ranji Trophy: జమ్మూ కాశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. లోయలో పెరుగుతున్న క్రీడా ప్రతిభను ఈ విజయం చాటిచెబుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

PM Narendra Modi Congratulates Jammu And Kashmir Cricket Team: భారత దేశవాళీ క్రికెట్లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు తమ మొట్టమొదటి రంజీ ట్రోఫీ (Ranji Trophy) టైటిల్ను కైవసం చేసుకుంది. హుబ్లీలోని కేఎస్సీఏ స్టేడియం (KSCA Stadium) వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో బలమైన కర్ణాటక జట్టును ఓడించి, జమ్మూ కాశ్మీర్ జట్టు ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
జట్టు పట్టుదలకు నిదర్శనం: ప్రధాని మోదీ..
ఈ విజయంపై ప్రధాని ట్వీట్ చేస్తూ.. “తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు ఇవే నా అభినందనలు! ఈ చారిత్రాత్మక విజయంతో జట్టులోని అసాధారణమైన పట్టుదల, క్రమశిక్షణ, ఆటపై వారికున్న మక్కువను ప్రతిబింబిస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం” అంటూ ప్రశంసలు కురిపించారు.
Congratulations to the Jammu and Kashmir team for their first ever Ranji Trophy win! This historic triumph reflects remarkable grit, discipline and passion of the team. It is a proud moment for the people of Jammu and Kashmir and it highlights the growing sporting passion and… pic.twitter.com/3fJO89Z5F8
— Narendra Modi (@narendramodi) February 28, 2026
లోయలో పెరుగుతున్న క్రీడా ప్రతిభను ఈ విజయం చాటిచెబుతోందని, ఈ విజయం మరెంతో మంది యువ అథ్లెట్లకు పెద్ద కలలు కనడానికి, క్రీడల్లో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయానికి కారకులు వీరే..
కెప్టెన్ పరాస్ డోగ్రా నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ జట్టు టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసింది.
బ్యాటింగ్ విభాగంలో శుభమ్ పుండిర్, కమ్రాన్ ఇక్బాల్, సాహిల్ లోత్రా అద్భుత సెంచరీలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
బౌలింగ్ విభాగంలో ఈ సీజన్ టాప్ వికెట్ టేకర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) తన పేస్తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించి విజయంలో కీలక భూమిక పోషించాడు.
కొత్త శకానికి నాంది..
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఈ విజయాన్ని కొనియాడారు. ఈ గెలుపు కేవలం క్రికెట్కే పరిమితం కాకుండా, ఆ ప్రాంతంలోని యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో దేశవాళీ క్రికెట్ మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ తనదైన ముద్ర వేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




