Mayank Yadav : జింబాబ్వే టూర్లో వైభవ్ కాదు.. టీమిండియాకు అసలైన గుడ్ న్యూస్ మయాంక్ యాదవ్
Mayank Yadav : జింబాబ్వే టూర్లో వైభవ్ సూర్యవంశీ మెరిసినా, టీమిండియాకు అసలైన గుడ్ న్యూస్ మయాంక్ యాదవ్ ఫిట్నెస్, వేగం. మూడు మ్యాచ్ల్లో 5 వికెట్లు తీసిన ఈ యువ పేసర్, 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసి భారత జట్టు భవిష్యత్తుపై ఆశలు పెంచాడు.

Mayank Yadav : భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పటిష్టమైన ప్రపంచ ఛాంపియన్ శైలిలో ఆడి టీ20 సిరీస్ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. గత నెల రోజుల్లో ఎదురైన రెండు ఊహించని ఓటముల తర్వాత, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ సిరీస్ విజయంలో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లో కలిపి అత్యధికంగా 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విస్ఫోటనం ఒకెత్తయితే, సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్పీడ్స్టర్ మయాంక్ యాదవ్ ప్రదర్శన టీమిండియాకు అసలైన శుభవార్తగా మారింది.
మళ్లీ ఫామ్లోకి వచ్చిన మయాంక్ యాదవ్
ఇంగ్లాండ్ పర్యటనలో నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేలో బ్యాట్తో సమాధానమివ్వగా, దాదాపు రెండేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఐపీఎల్ 2024లో తన అద్భుతమైన వేగంతో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన మయాంక్, అక్టోబర్ 2024లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత వరుస గాయాల కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ తదుపరి సీజన్లలో కూడా గాయాలు అతన్ని వేధించాయి. దీంతో ఈ సిరీస్తో మళ్లీ బౌలింగ్ వేగం, కచ్చితత్వం ఎలా ఉంటుందోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తొలి బంతికే వికెట్.. సిరీస్లో టాప్ వికెట్ టేకర్
తనపై ఉన్న అనుమానాలన్నింటినీ మయాంక్ యాదవ్ తన బౌలింగ్తో పటాపంచలు చేశాడు. సిరీస్లోని మొదటి మ్యాచ్తో పాటు చివరి మ్యాచ్లోనూ ఇన్నింగ్స్ వేసిన తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ను పెవిలియన్కు పంపి సంచలనం సృష్టించాడు. తన కేవలం 6 మ్యాచుల అంతర్జాతీయ కెరీర్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఇది మూడోసారి కావడం విశేషం. ఈ సిరీస్లోని 3 మ్యాచుల్లో మయాంక్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా కేవలం 6.54 ఎకానమీ రేట్తో పరుగులను కట్టడి చేసి తాను ఎంత ప్రమాదకరమైన బౌలరో మరోసారి నిరూపించుకున్నాడు.
ఫిట్నెస్తో పెరిగిన నమ్మకం
మయాంక్ వికెట్లు తీయడం ఒకెత్తయితే, అతని ఫిట్నెస్ నిలకడగా ఉండటం టీమిండియా యాజమాన్యానికి పెద్ద ఊరటనిచ్చింది. ఈ టూర్లో రెండో మ్యాచ్లోనే ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ గాయపడగా, అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్లో హర్షిత్ రాణా గాయాల పాలయ్యాడు. కానీ మయాంక్ యాదవ్ ఎలాంటి శారీరక ఇబ్బందులు లేకుండా సిరీస్ మొత్తాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. సిరీస్ అంతటా 11 ఓవర్లు వేసిన మయాంక్, నిలకడగా గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. పలుమార్లు 148 నుంచి 150 కి.మీ వేగాన్ని కూడా అందుకున్నాడు. రాబోయే సిరీస్లలో కూడా అతను ఇదే ఫిట్నెస్ను కొనసాగిస్తే భారత జట్టుకు ప్రధాన వేగవంతమైన బౌలర్గా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
