ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్ శర్మ! ఇదెక్కడి ట్విస్ట్ మావ..?
బీసీసీఐ షాకింగ్ నిర్ణయంలో భాగంగా, విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ ఇండియా-ఏ తరఫున ఇంగ్లాండ్తో జరిగే రెండు టూర్ మ్యాచ్లలో ఆడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో జరిగే కీలకమైన టెస్ట్ సిరీస్కు ముందు వీరిద్దరిని ఫామ్లోకి తీసుకురావడమే లక్ష్యం. ఐపీఎల్ ప్లేఆఫ్స్తో వారి షెడ్యూల్ బిజీగా ఉండటం ఒక సవాలు.

టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రతీ రోజు మ్యాచ్తో క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ ఫీవర్తో ఊగిపోతుండగా.. మరోవైపు బీసీసీఐ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఇండియా-ఏ తరఫున ఆడాల్సిందిగా కోరే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. అదేంటి.. ఈ దిగ్గజ క్రికెటర్లు ఎందుకు ఇండియా-ఏ జట్టు తరఫున ఆడాలి? అని అనుకుంటున్నారా? అందుకు ఓ కారణం ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల లాంగ్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఈ సిరీస్ నుంచి ప్రారంభం అవుతుంది. డబ్ల్యూటీసీ సైకిల్లో ఎంతో కీలకమైన ఈ సిరీస్లో టీమిండియా ఎలాగైన మంచి ప్రదర్శన చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసమే ఈ సిరీస్ కోసం భారత ఆటగాళ్లను రెడీ చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ సిరీస్కు ముందు, ఇండియా-ఏ జట్టును మే 30 నుండి రెండు టూర్ మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ కు పంపనుంది. మొదటి నాలుగు రోజుల మ్యాచ్ మే 30 నుండి కాంటర్బరీలోని సెయింట్ లారెన్స్లోని స్పిట్ఫైర్ గ్రౌండ్లో జరుగుతుంది. రెండవ మ్యాచ్ ఒక వారం తర్వాత జూన్ 6న నార్తాంప్టన్లోని కౌంటీ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. ఈ రెండింటిలో తొలి మ్యాచ్లో ఇండియా-ఏ జట్టులో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండే ఛాన్స్ ఉంది.
రెడ్ బాల్ క్రికెట్లో గత కొంతకాలంగా ఈ సీనియర్ క్రికెటర్లు సరైన ప్రదర్శన చేయలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఒక సెంచరీ చేసినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 23.75 యావరేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక రోహిత్ అయితే దారుణంగా విఫలం అయ్యాడు. ఒక మ్యాచ్కు తనే స్వయంగా దూరంగా ఉన్నాడు. వీరిద్దరూ ఇంగ్లండ్ సిరీస్లో ఎంతో కీలకం. వీరిని ఫామ్లోకి తీసుకొచ్చేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ 20, 21, 23 తేదీల్లో జరగనున్నాయి. అలాగే ఫైనల్ మే 25న జరుగుతోంది. ఒక వేళ ముంబై, ఆర్సీబీ ఫైనల్కు చేరితే.. రోహిత్, కోహ్లీ బిజీ షెడ్యూల్తో తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి దీన్ని బీసీసీఐ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.