నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..!
T20 League Controversy: వ్యాపార కోణంలో జట్టు బలాన్ని పెంచుకోవడానికి మైదానంలో రాణించే ఆటగాళ్లను ఎంచుకోవడం ఫ్రాంచైజీల నైజం. అభిమానుల భావోద్వేగాలను పక్కన పెట్టి సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తీసుకుంటున్న నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Sunrisers Eastern Cape: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ద హండ్రెడ్లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసి విమర్శలు మూటగట్టుకున్న ఆమె, తాజాగా దక్షిణాఫ్రికా లీగ్లో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ను జట్టులోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
గ్లోబల్ క్రికెట్ లీగ్స్లో సన్గ్రూప్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది లండన్లో జరిగే ద హండ్రెడ్ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసి కావ్య మారన్ సంచలనం సృష్టించారు. మైదానంలో టీమిండియా ఆటగాళ్లను గేలి చేసిన చరిత్ర ఉన్న అబ్రార్ను జట్టులోకి తీసుకోవడం పట్ల భారత క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కావ్య మారన్ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు బంగ్లాదేశ్ స్పిన్నర్పై కోట్ల వర్షం..
పాకిస్తాన్ వివాదం సమసేలోపే కావ్య మారన్ మరొక కీలక అడుగు వేశారు. దక్షిణాఫ్రికాలో జరగబోయే ఎస్ఏ20 లీగ్ 2027 సీజన్ కోసం బంగ్లాదేశ్ యంగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ను సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఒప్పందం చేసుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్రైడర్స్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టింది. అలాంటి పరిస్థితుల్లో రిషాద్ హుస్సేన్ను చేర్చుకోవడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది.
భారీ ధర చెల్లించినట్లు సమాచారం..
ఎస్ఏ20 టోర్నీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల ముందస్తు ఒప్పందాల మొత్తాన్ని అధికారికంగా వెల్లడించరు. రిషాద్ హుస్సేన్కు చెల్లించిన ఖచ్చితమైన కాంట్రాక్ట్ విలువ బయటకు రాకపోయినప్పటికీ, ఆయన సేవలను సొంతం చేసుకోవడానికి భారీ మొత్తమే కేటాయించినట్లు సమాచారం. టీ20 ఫార్మాట్లో ప్రతిభావంతుడైన బౌలర్గా పేరున్న రిషాద్, ఈ లీగ్లో అవకాశం దక్కించుకున్న తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా నిలిచారు.
సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న నిరసన..
కావ్య మారన్ వరుస నిర్ణయాలపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సెంటిమెంట్లను పక్కన పెట్టి పొరుగు దేశాల ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్చుకోకుండా, మళ్లీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




