IPL 2026: రూ. 8.6 కోట్లు ఇస్తే హనీమూన్ ఎవరికి కావాలి? కావ్య వర్సెస్ గోయెంకా వార్లో బిగ్గెస్ట్ డ్రామా
Josh inglis: ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్మన్ జోష్ ఇంగ్లిస్ను IPL 2026 వేలంలో రూ. 8.6 కోట్లకు కొనుగోలు చేశారు. మొదట్లో, అతని వివాహం కారణంగా ఐపీఎల్ 2026కి అందుబాటులో ఉండరని ఊహాగానాలు వచ్చాయి. అయితే, భారీ వేలం ధర తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి నివేదికలు మరోలా సూచిస్తున్నాయి.

Josh inglis: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis) ఐపీఎల్ 2026 వేలంలో హాట్ టాపిక్గా మారారు. కేవలం నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని ముందే ప్రకటించినప్పటికీ, అతని కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అతను తన హనీమూన్ను వాయిదా వేసుకుని ఐపీఎల్ కోసం రానున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హనీమూన్ వాయిదా?..
జోష్ ఇంగ్లిస్ వివాహం 2026 ఏప్రిల్ 18న జరగనుంది. ఈ కారణంగానే అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేనని, కేవలం 4 మ్యాచ్లే ఆడుతానని గతంలోనే బీసీసీఐకి, ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చాడు. అయితే, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అతనికి రూ. 8.6 కోట్లు భారీ ధరను ఆఫర్ చేయడంతో ఇప్పుడు సమీకరణాలు మారాయి.
తాజా సమాచారం ప్రకారం, ఇంత భారీ ధర దక్కడంతో ఇంగ్లిస్ తన హనీమూన్ ప్లాన్స్ను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి కోసం చిన్న విరామం తీసుకుని, ఆ వెంటనే మళ్ళీ లక్నో జట్టుతో చేరే అవకాశం ఉంది.
కావ్య మారన్ vs సంజీవ్ గోయెంకా..
అబుదాబిలో జరిగిన వేలంలో ఇంగ్లిస్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్య మారన్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
కావ్య మారన్ రూ. 8.40 కోట్ల వరకు బిడ్ వేయగా, చివరకు లక్నో రూ. 8.60 కోట్లకు అతన్ని దక్కించుకుంది.
కేవలం 4 మ్యాచ్లు ఆడే ప్లేయర్ కోసం ఇంత ధర పెట్టడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతను హనీమూన్ వాయిదా వేసుకుని ఎక్కువ మ్యాచ్లు ఆడితే లక్నోకు అది పెద్ద ప్లస్ అవుతుంది.
పంజాబ్ కింగ్స్ ఆగ్రహం..
జోష్ ఇంగ్లిస్ వ్యవహారంపై అతని పాత ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (PBKS) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పంజాబ్ కో-ఓనర్ నెజ్ వాడియా మాట్లాడుతూ.. ఇంగ్లిస్ ప్రవర్తన “అన్ ప్రొఫెషనల్” గా ఉందని విమర్శించారు. రిటెన్షన్ డెడ్ లైన్కు కేవలం 45 నిమిషాల ముందు మాత్రమే తాను అందుబాటులో ఉండనని ఇంగ్లిస్ చెప్పాడని, అందుకే అతన్ని వదిలేయాల్సి వచ్చిందని వాడియా పేర్కొన్నారు. తీరా వేలంలోకి వచ్చి ఎక్కువ మ్యాచ్లు ఆడుతానని చెప్పడం పంజాబ్ను విస్మయానికి గురిచేసింది.
లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్తో ఇంగ్లిస్కు ఉన్న సాన్నిహిత్యం వల్లే లక్నో ధైర్యంగా అతనిపై అంత భారీ పందెం కాసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, 8.6 కోట్ల కోసం ఇంగ్లిస్ తన వ్యక్తిగత ప్లాన్స్ను మార్చుకోవడం ఐపీఎల్ క్రేజ్కు అద్దం పడుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




