IPL Media Rights: ‘ప్యాకేజీ సి’ని దక్కించుకున్న వయాకామ్ 18, స్టార్.. ఒక్కో మ్యాచ్ ధర రూ.33.34 కోట్లు..
ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐ భారీగా డబ్బు సంపాదించింది. ఇప్పటి వరకు జరిగిన మూడు ప్యాకేజీల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలోకి రూ. 46 వేల కోట్లకు పైగానే వచ్చాయని సమాచారం.
ఐపీఎల్(IPL) తదుపరి ఐదు సీజన్ల మీడియా హక్కుల వేలంలో మంగళవారం మూడో రోజు మూడవ ప్యాకేజీ వేలం నిర్వహించారు. ప్యాకేజీ-సీ ధర ఒక్కో మ్యాచ్కు రూ.33.34 కోట్లుగా నిలిచింది. ప్యాకేజీ-సీలో సీజన్లోని మొదటి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్, మూడు ప్లేఆఫ్లు, వారాంతపు డబుల్-హెడర్ మ్యాచ్లతో కలిపి మొత్తం 18-20 మ్యాచ్ల హక్కులు ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఈ హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసింది. టీవీ హక్కులు డిస్నీ స్టార్ వద్ద ఉండగా అదే కంపెనీ డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.
బీసీసీఐ ఖాతాలోకి రూ. 47 కోట్లు..
అనుకున్నట్లే జరిగింది. ప్యాకేజీ-డీ వేలం ఇంకా పెండింగ్లో ఉండగా, బీసీసీఐ బ్యాగ్లో మిగతా మూడు హక్కుల వేలం నుంచి భారీ మొత్తం సమకూరాయి. ఈ మూడు ప్యాకేజీల నుంచి రూ.47,332.52 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి చేరాయి. ప్యాకేజీ-ఏ అంటే టీవీ హక్కుల ద్వారా బీసీసీఐ మొత్తం రూ.23,575 కోట్లు పొందింది. అదే సమయంలో, ప్యాకేజీ-బీ అంటే డిజిటల్ హక్కుల నుంచి రూ. 20,500 కోట్లు బీసీసీఐ జేబులోకి చేరాయి. ప్యాకేజీ-సీ నుంచి రూ. 3,257.52 కోట్లను భారత బోర్డు అందుకుంది.
వివిధ ప్లాట్ఫారమ్లలో మ్యాచ్లు..
టీవీ, డిజిటల్ హక్కులు వేర్వేరు కంపెనీలకు వెళ్లడం అంటే.. ఐపీఎల్ రెండు వేర్వేరు వేదికలపైకి రానుంది. స్టార్ టీవీ హక్కులను తన వద్దే ఉంచుకుంది. కానీ, ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను కోల్పోయింది. అంతకుముందు, స్టార్కి ఈ రెండూ హక్కులు ఉండేవి. మ్యాచ్లను ఆన్లైన్లో ప్రసారం చేయడానికి హాట్స్టార్ అనే డిజిటల్ ప్లాట్ఫారమ్ను ఉపయోగించుకుంది. స్టార్ 2017 నుంచి 2022 వరకు ఈ హక్కులను రూ. 16,000 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్యాకేజీ-డీపై కూడా డబ్బుల వర్షం..
అందరి దృష్టి ప్యాకేజీ డీ పైనే పడింది. ఈ ప్యాకేజీలో భారత ఉపఖండం వెలుపల టీవీ, డిజిటల్ హక్కులు ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఈ ప్యాకేజీకి బిడ్ రూ. 1058 కోట్లుగా నిర్ణయించింది. అంటే బీసీసీఐ ఒక్కో మ్యాచ్కు రూ. 2.58 కోట్లు పొందుతుంది. ఈ హక్కులు ఏ కంపెనీకి చేరాయనే సంగతి తెలియనప్పటికీ.. దీనికి కూడా తీవ్రమైన పోటీ నెలకొంది.
#IPL | “Viacom18 bags digital rights with its winning bid of Rs 23,758 crores. Star India wins India TV rights with their bid of Rs 23,575 crores,” tweets BCCI secretary Jay Shah. pic.twitter.com/hUtUUfP7N0
— ANI (@ANI) June 14, 2022
టార్గెట్ చేరిన బీసీసీఐ..
ఈ వేలానికి ముందు మార్కెట్ వేడెక్కింది. ఈ మీడియా హక్కుల నుంచి బీసీసీఐ రూ. 50 నుంచి రూ. 60 వేల కోట్లను పొందనుందనే ఊహాగానాలు వినిపించాయి. భారత బోర్డు ఈ లక్ష్యానికి చేరువలోకి వచ్చింది. వేలంలో మొత్తం రూ.48,390.52 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి చేరాయి.