SRH: 3 మ్యాచ్లు.. 3 వివాదాలు..! బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్న సన్రైజర్స్ హైదరాబాద్?
ఇండియన్ ప్రిమియర్ లీగ్ 19వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అంపైర్ల నిర్ణయాలు జట్టు ఫలితాలపై ప్రభావం చూపాయని యాజమాన్యం భావిస్తోంది. వరుస తప్పులతో విసిగిపోయిన కావ్య మారన్ బృందం, ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గడప తొక్కేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి, ఒక విజయం మరియు రెండు ఓటములను నమోదు చేసింది. అయితే, ఈ మూడు మ్యాచ్లలోనూ మైదానంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు జట్టును తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో అంపైర్లు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆరెంజ్ ఆర్మీ మేనేజ్మెంట్ నమ్ముతోంది. ఈ మేరకు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
క్లాసెన్ అవుట్.. సరిహద్దు రేఖ వద్ద సందిగ్ధం..
సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడినప్పుడు హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయిన తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫిలిప్ సాల్ట్ బౌండరీ వద్ద పట్టుకున్న క్యాచ్లో అతని పాదం కుషన్లకు తగిలినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా, థర్డ్ అంపైర్ దానిని అవుట్గా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ అది సిక్సర్ అయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభిషేక్ శర్మ క్యాచ్, జరిమానా..
కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన రెండో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ మరో వివాదానికి దారితీసింది. వరుణ్ చక్రవర్తి పట్టుకున్న క్యాచ్ నేలకు తగిలినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మైదానంలోనే అసహనం వ్యక్తం చేసినందుకు అభిషేక్ శర్మకు జరిమానా కూడా విధించారు. మ్యాచ్ గెలిచినప్పటికీ, సరైన నిర్ణయం తీసుకోకపోవడంపై జట్టు మేనేజ్మెంట్ గుర్రుగా ఉంది.
లక్నో మ్యాచ్లో నిబంధనల ఉల్లంఘన..
అన్నిటికంటే విచిత్రమైన ఘటన లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మూడో మ్యాచ్లో వెలుగుచూసింది. ఆఖరి ఓవర్లో లక్నో బ్యాటర్ కొట్టిన బంతి బౌండరీ లైన్ దాటకముందే, డగౌట్లో ఉన్న ఆవేశ్ ఖాన్ అత్యుత్సాహంతో బౌండరీ వెలుపల నుండి దానిని తాకాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ‘అన్ఫెయిర్ ప్లే’ కిందికి వస్తుంది. దీనివల్ల సన్రైజర్స్కు ఐదు పరుగులు పెనాల్టీగా లభించాల్సి ఉండగా, అంపైర్లు దీనిని గమనించలేదు.
ఈ వరుస పరిణామాలపై వివరణ కోరుతూ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ త్వరలోనే బీసీసీఐకి లేఖ రాయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
